10శాతం రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోద ముద్ర
కేంద్రం తీసుకొచ్చిన అగ్రకులాలకు 10శాతం రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతకం చేయడంతో ఈబీసీ బిల్లు చట్టరూపం దాల్చింది. దీంతో దేశవ్యాప్తంగా ఈబీసీ బిల్లు అమల్లోకి వచ్చింది. కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టం ద్వారా ఇకపై అగ్రకులాలకు చెందిన పేదవారికి విద్య ఉద్యోగావకాశాల్లో 10శాతం రిజర్వేషన్ వర్తించనున్నాయి. అగ్రకులాల్లో పేదలకు 10శాతం రిజర్వేషన్ కల్పించాలని క్యాబినెట్ ఆమోదం తెలపడం.. ఆ తర్వాత బిల్లు లోక్సభ ముందు ప్రవేశపెట్టి పాస్ చేయించడం... అనంతరం బిల్లును రాజ్యసభలో కూడా పాస్ చేయించి రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లును పంపడం అన్నీ కేవలం 10 రోజుల్లో జరిగిపోవడం విశేషం.
అగ్రకులాలకు చెందిన పేదలకు 10శాతం రిజర్వేషన్ కల్పిస్తే కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుకు మంగళవారం లోక్సభ ఆమోదం తెలిపింది. మొత్తం 323 మంది బిల్లుకు అనుకూలంగా ఓటువేయగా ముగ్గురు మాత్రం బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. అంతకుముందు బిల్లుపై లోక్సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. న్యాయ సమీక్షలో ఇది నిలబడటం కష్టమేనని విపక్షాలు చెబుతూనే బిల్లుకు మద్దతు తెలిపాయి. ఎన్నికలకు ముందు మోడీ సర్కార్ పెద్ద డ్రామాను నడిపిస్తోందని విపక్షాలు ధ్వజమెత్తాయి.
ఇక బుధవారం రాజ్యసభ బిల్లుకు ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 149 మంది సభ్యులు, వ్యతిరేకంగా ఏడుగురు సభ్యులు ఓటు వేశారు. బిల్లును సెలెక్టు కమిటీకి పంపాలన్న సవరణ ప్రతిపాదనకు అనుకూలంగా 18 మంది సభ్యులు, వ్యతిరేకంగా 155 మంది సభ్యులు ఓటు వేశారు.ఈబీసీలకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రధాని నరేంద్ర మోడీ బిల్లు తెచ్చారని చెప్పారు కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ తెలిపారు.