ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ: 20 మంది ఎమ్మెల్యేలపై ఈసీ సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదలచేసింది. ఇరవై మందిపై కేంద్ర ఎన్నికల సంఘం చేసిన ప్రతిపాదనను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదించారు. దీంతో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
లాభదాయక పదవుల్లో ఉన్నందున ఇరవై మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం రెండు రోజుల క్రితం రామ్నాత్ కోవింద్కు సిఫార్సు చేసింది. ఎన్నికల సంఘం ప్రతిపాదనను రాష్ట్రపతి ఆమోదించడంతో ఏఏపీకి గట్టి షాక్ తగిలింది.
ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీలో ఏఏపీకి ఉన్న మెజార్టీ 45కు చేరింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఏఏపీ సంఖ్యాబలం 65. ఇప్పుడు 20మందిపై వేటు పడటంతో 45కు తగ్గింది. ఈ ఇరవై అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అనర్హత వేటు పడిన వారిలో మంత్రి కైలాష్ గెహ్లాట్, ఎమ్మెల్యే అల్కా లాంబా కూడా ఉన్నారు.
21 మంది ఎమ్మెల్యేలు ఏడాదిన్నర పాటు పార్లమెంటరీ కార్యదర్శుల పదవిలో ఉండటం ద్వారా లాభదాయక పదవులను చేపట్టినట్లయిందని, ఫలితంగా ఎమ్మెల్యేలుగా అనర్హులు అవుతారని రాష్ట్రపతికి ఈసీ ప్రతిపాదన పంపించింది. 21 మంది ఎమ్మెల్యేల్లో ఒకరు ఇటీవల రాజీనామా చేశారు. దీంతో 20మందిపై వేటు పడింది.
ఈ సిఫార్సును వ్యతిరేకిస్తూ ఏఏపీ ఎమ్మెల్యేలు ఢిల్లీ హైకోర్టును ఆస్రయించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు నో చెప్పింది. ఈసీ నిర్ణయంపై ఏఏపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు, బీజేపీ, కాంగ్రెస్ దీనిని స్వాగతించాయి.