దేశం గొప్ప ప్రజాసేవకుడిని కోల్పోయింది: రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోడీ, కేసీఆర్ సహా నేతల స్పందన
న్యూఢిల్లీ: గోవా సీఎం మనోహర్ పారికర్ ఆదివారం కన్నుమూశారు. గత కొంత కాలంగా క్లోమ గ్రంథి క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ఆయనకు చికిత్స అందించేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. పారికర్ మృతికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ తదితరులు సంతాపం తెలిపారు.
మనోహర్ పారికర్ మృతి కలచివేసిందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. రక్షణ శాఖ మంత్రిగా దేశానికి ఆయన ఎంతో సేవ చేశారని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. మనోహర్ పారికర్తో పోల్చతగిన నాయకుడు లేడన్నారు. మోడర్న్ గోవాను నిర్మించిన మహోన్నతుడు పారికర్ అన్నారు.
నరేంద్ర మోడీ మృతి ఎంతో విచారకరమని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అతని నిస్వార్థ సేవ మాకు స్ఫూర్తిదాయకం అన్నారు. దేశమే ముందు అని నిరూపించిన మహోన్నతుడు పారికర్ అని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా అన్నారు. అతని మృతి ఎంతో బాధాకరమని, అసలైన దేశభక్తున్ని కోల్పోయామని పేర్కొన్నారు.
మనోహర్ పారికర్ మృతి విచారకరమని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. పారికర్ మృతి పట్ల తెలంగాణ సిఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశం ఒక గొప్ప ప్రజాసేవకుడిని కోల్పోయిందన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పారికర్ మృతి పట్ల తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్, ఏపీ మంత్రి నారా లోకేష్ సంతాపం తెలిపారు.