సెల్యూట్ కోవింద్: ప్రోటోకాల్ పక్కనపెట్టి, మహిళా ఉద్యోగివద్దకు, ధైర్యం చెప్పి...(వీడియో)
రాష్ట్రపతి.. దేశ ప్రథమ పౌరుడు. త్రివిద దళాల అధిపతి. రబ్బర్స్టాంప్ అనే అపప్రద ఉన్న రాజముద్ర లేనిది ఏ బిల్లు చట్టరూపం దాల్చదు. రాష్ట్రపతి పదవీకి దేశంలో అంత విలువ ఉంది. ప్రెసిడెంట్ టూర్ బిజీగా ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం వెళ్లడమే తీరిక లేకుండా పోతోంది. ఇక సామాన్యుల బాగోగులను పట్టించుకునే సమయం, సందర్భం ఏదీ. కానీ భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మాత్రం తన ప్రోటోకాల్ను పక్కనపెట్టి మరీ ప్రవర్తించారు.
కోవింద్ చొరవ
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ వద్ద జాతీయ సీఎస్ఆర్ అవార్డు కార్యక్రమం జరుగుతుంది. ముఖ్య అతిథిగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హాజరయ్యారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ సహా ముఖ్యులు హాజరయ్యారు. సాధారణంగా రాష్ట్రపతి వచ్చే సమయంలో, వెళ్లిపోయే సమయంలో జాతీయ గీతం ఆలాపిస్తారు. ఫంక్షన్ వద్దకొచ్చి తిరిగి వెళ్తుండగా జాతీయ గీతం ఆలపిస్తున్నారు. ఇంతలో అనుకొని ఘటన జరిగింది.
తుళ్లి పడిపోయిన ఉద్యోగిని
సభ వేదిక వద్ద మహిళా పోలీసు అధికారి విధులు నిర్వహిస్తున్నారు. జాతీయ గీతం ఆలపించే సమయంలో ఆమె కాలు స్లిప్ అయ్యి కార్పెట్పై పడిపోయారు. కింద పడిపోయి.. మెల్లగా లేచారు. దీనిని రాష్ట్రపతి కోవింద్ గమనించారు. జాతీయ గీతం ముగిశాక ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ను మహిళా ఉద్యోగి వద్దకు పంపించారు. ఆయన వచ్చి ఏం జరిగిందని ఉద్యోగిని ఆరాతీశారు. వాటర్ బాటిల్ తీసి మరీ ఆమెకు ఇచ్చారు.
ఆరా తీసి.. ముందుకెళ్లి
జాతీయగీత ఆలాపన ముగిసాక సాధారణంగా రాష్ట్రపతి వెళ్లిపోతారు. కానీ మహిళ ఉద్యోగి కిందపడిపోవడంతో.. అలా వెళ్లలేదు కోవింద్. ఉద్యోగిని వద్దకెళ్లారు. రాష్ట్రపతి ఆమె వద్దకు కదలడంతో అక్కడున్న వారు బిగ్గరగా అరిచారు. తన యోగక్షేమాల గురించి ఆరాతీశారు. ఏమైందని.. ఎందుకిలా జరిగిందని చెప్పారు. తర్వాత అక్కడినుంచి వెనుదిరిగి.. రాష్ట్రపతి భవన్ వెళ్లిపోయారు.
పట్టించుకోరు.. కానీ
సాధారణంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి స్థాయిలో కిందిస్థాయి సిబ్బంది వద్దకెళ్లారు. జనంతో మమేకమయ్యే సమయంలోనే ఆంక్షలు ఉంటాయి. ఇక సభ వేదికల వద్ద పెద్దగా పట్టించుకోరు. కానీ రామ్నాథ్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా.. ఉద్యోగితో మాట్లాడారు. ఆమెలో ధైర్యం నింపారు. రాష్ట్రపతి కోవింద్ చొరవను అక్కడున్న వారు అభినందించారు. శెభాష్ అంటూ కీర్తించారు.