పోక్సో ఆర్డినెన్స్కు రాష్ట్రపతి ఆమోదం, మైనర్లను రేప్ చేస్తే ఉరిశిక్షే
న్యూఢిల్లీ: పోక్సో చట్ట సవరణ ఆర్డినెన్స్కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదివారం నాడు ఆమోదముద్ర వేశారు. కథువా అత్యాచార ఘటన తర్వాత పోక్సో చట్టాన్ని మరింత కఠినతరం చేస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.ఈ ఆర్డినెన్స్కు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.
కాశ్మీర్లోని కథువాలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటనపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇదే తరహా అత్యాచార ఘటనలు దేశంలో పలు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలోనే ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఈ తరుణంలో పోక్సో చట్టానికి సవరణలు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు కూడ పోక్సో చట్టానికి సవరణలు చేస్తున్నట్టు నాలుగు రోజుల క్రితం కేంద్రం తెలిపింది.
సుప్రీంకోర్టుకు చెప్పినట్టుగానే పోక్సో చట్టానికి సవరణ చేస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.ఈ ఆర్డినెన్స్ను రాష్ట్రపతి ఆమోదం కోసం శనివారం నాడు పంపారు.ఈ ఆర్డినెన్స్కు రాష్ట్రపతి కోవింద్ ఆమోదముద్ర వేశారు.
మైనర్లపై అత్యాచారానికి పాల్పడే నిందితులను కఠినంగా శిక్షించేందుకు గాను పోక్సో చట్టానికి సవరణ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. మైనర్లపై అత్యాచారానికి పాల్పడితే ఉరిశిక్ష విధించనున్నారు. భవిష్యత్తులో ఈ తరహ ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు గాను ఈ ఆర్డినెన్స్ తెచ్చారు.
పన్నెండేళ్ళ లోపు వయసుగల బాలికలపై అత్యాచారాలు జరిగినట్లు నమోదయ్యే కేసుల పరిష్కారానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తారు. రెండు నెలల్లోగా దర్యాప్తు ముగించాలని ఈ ఆర్డినెన్స్ చెప్తోంది. అన్ని ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్లలోనూ ప్రత్యేక ఫోరెన్సిక్ కిట్స్ను అందుబాటులో ఉంచుతారు. పదహారేళ్ళ లోపు వయసు, పన్నెండేళ్ళ లోపు వయసుగల బాలికలపై అత్యాచారాల కేసుల్లో నేరస్థులను కఠినంగా శిక్షించేందుకు ఈ ఆర్డినెన్స్ అవకాశం కల్పిస్తోంది. మహిళలపై అత్యాచారం చేసినట్లు రుజువైతే నేరస్థునికి విధించదగిన శిక్షను ఏడేళ్ళ నుంచి పదేళ్ళ కఠిన కారాగార శిక్షకు పెంచారు.