ఇటు అమెరికా ప్రెసిడెంట్.. అటు యూకే సుప్రీంకోర్టు ప్రెసిడెంట్.. అరుదైన రోజు ఇది..
ప్రపంచ దేశాల్లో భారత పరపతికి సంబంధించి సోమవారం రెండు కీలక సంఘటనలు చోటుచేసుకున్నాయి. మొదటిది యునైలెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్, ఆగ్రా పర్యటన కాగా.. రెండోది యునైటెడ్ కింగ్ డమ్ సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ లార్డ్ రాబర్ట్ జాన్ రీడ్ సుప్రీంకోర్టు సందర్శన. ఈ రెండు ఈవెంట్లకు పోలిక లేనప్పటికీ.. ఒక దేశ పొలిటికల్ బాస్, మరోదేశ జ్యూడీషియరీ హెడ్ ఒకేసారి ఇండియాలో ఉండటం గమనార్హం.
అంతర్జాతీయ న్యాయ సదస్సులో పాల్గొనేందుకు ఇండియా వచ్చిన యూకే న్యాయాధిపతి..లార్డ్ రాబర్ట్ జాన్ రీడ్ సోమవారం సుప్రీంకోర్టు విచారణలో పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశ సుప్రీంకోర్టులో వాదనలు ఎలా జరుగుతున్నాయో ఆయన గమనించారు. సుప్రీంకోర్టుకు వచ్చిన ఆయనకు అటార్నీ జనరల్ కే.కే.వేణుగోపాల్ స్వాగతం పలికారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్.ఏ.బోబ్డే పక్కనే జిస్టిస్ జాన్ రీడ్ కూర్చుకున్నారు.
Recommended Video
యూకే సుప్రీం కోర్టు ప్రెసిడెంట్ లార్డ్ రాబర్ట్ జాన్ రీడ్.. భారత ప్రధాన న్యాయమూర్తితో కలిసి మధ్యవర్తిత్వం( ఆర్బిట్రేషన్) వ్యవహారానికి సంబంధించిన కేసును విచారించారు. దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య పేరుకుపోతున్న దరిమిలా.. న్యాయ వివాదాలకు సంబంధించి మధ్యవర్తిత్వాన్ని (ఆర్బిట్రేషన్) తప్పనిసరి చేయాలనేవాదన కొంతకాలంగా బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
కొద్ది రోజుల కిందట ఇదే అంశపై సీజేఐ బోబ్డే మాట్లాడుతూ.. మధ్యవర్తిత్వాన్ని తప్పని సరి చట్టంగా మార్చితే.. తద్వారా కోర్టులకు, కక్షిదారులకు సమయం వృథాకాకుండా మిగులుతుందని, ఆ మేరకు 'మధ్యవర్తిత్వ' సంస్కృతిని విస్తృతం చేయడంతోపాటు అనుభవం కలిగిన న్యాయవాదులను అందుబాటులో ఉంచేందుకు 'బార్ కౌన్సిల్' మాదిరిగా 'ఆర్బిట్రేషన్ (మధ్యవర్తిత్వ) బార్'లు, న్యాయవాదుల శిక్షణ కోసం ప్రత్యేక సంస్థలను నెలకొల్పాల్సి ఉందని సూచించారు. ఆర్బిట్రేషన్ పై విచారణ సందర్భంలో యూకే సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ తన అభిప్రాయాన్ని వెల్లడించలేదు.