ఆప్ కీ అదాలత్: మోడీ పాల్గొనే టీవీ ప్రోగ్రాంలో లక్ష్మీపార్వతి
న్యూఢిల్లీ/హైదరాబాద్: స్వర్గీయ నందమూరి తారక రామారావు సతీమణి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతికి ఆప్ కీ అదాలత్ నుండి ఆహ్వానం అందింది. ఇండియా టీవీ నిర్వహించే ఈ కార్యక్రమంలో ఇప్పటికే పలువురికి ఆహ్వానాలు అందాయి. తాజాగా లక్ష్మీపార్వతికి ఆహ్వానం వచ్చింది. ఇందుకు ఆమె సుముఖత వ్యక్తం చేశారు.
ఇండియా టీవీ నిర్వహిస్తున్న పాప్యులర్ టీవీ షో ఆప్ కీ అదాలత్. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి 21 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 21న ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు సీనియర్ మంత్రులు కూడా పాల్గొంటున్నారు.
ఈ కార్యక్రమానికి టాప్ క్రికెటర్లు, అధికారులు, జడ్జిలు రానున్నారు. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ తదితరులు కూడా హాజరు కానున్నారు.
గతంలో ఆప్ కీ అదాలత్ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న పలువురికి నివాళులు కూడా అర్పించనున్నారు. దివంగత బాల్ థాకరే, రాజేష్ ఖన్నా, రాజేష్ పైలట్, ప్రమోద్ మహాజన్, గజల్ సింగర్, జగ్జీత్ సింగ్ తదితరులకు నివాళులు అర్పించనున్నారు.