రాష్ట్రపతి ఫోన్ బిల్లు రూ. 5 లక్షలు: బడ్జెట్ రూ. 41.96 కోట్లు
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి భవన్ నెల ఫోన్ బిల్లు రూ. 5 లక్షలు వస్తుందని వెలుగు చూసింది. అయితే ఈ విషయం బయటకు రావడానికి కారణం అయిన వ్యక్తి పూర్తి వివరాలు తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏదో తెలుసుకోవాలని ఆరాటపడిన సదరు వ్యక్తి ఈ వివరాలు బయటకు వెల్లడించాడు.
ముంబైలోని జోగేశ్వరి ఏరియాలో మన్సూర్ దర్వేష్ అనే ఆర్ టీఐ కార్యకర్త నివాసం ఉంటున్నారు. ఈయన రాష్ట్రపతి భవన్ కు ఎంత బడ్డెట్ కేటాయిస్తున్నారు, ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు, రాష్ట్రపతి భవన్ తీరు తెన్నులు ఏమిటి అని తెలుసుకోవాలని ఆసక్తి చూపించాడు.
సమాచార హక్కు చట్టాన్ని (ఆర్ టీఐ)ని ఆశ్రయించాడు. ఒక అర్జీ పూర్తి చేసి పంపించాడు. రాష్ట్రపతి భవన్ నిర్వహణ, అక్కడి ఉద్యోగుల సంఖ్య, జీతాలు ఎంత, ఖర్చు ఎంత, పోన్ బిల్లులు ఎంత అని పూర్తి వివరాలను రాబట్టాడు.
రాష్ట్రపతి భవన్ కు 2014-15 బడ్జెట్ లో రూ. 41.96 కోట్లు, 2013-14 బడ్జెట్ లో రూ.38.70 కోట్లు, 2012-13 బడ్జెట్ లో రూ.30.96 కోట్ల నిధులు కేటాయించారని వెలుగు చూసింది. రాష్ట్రపతి భవన్ లో మొత్తం 754 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు, అందులో 9 మంది ప్రయివేటు సెక్యూరిటి గార్డులు ఉన్నారు.
27 మంది డ్రైవర్లు, 64 మంది సపాయికారులు పని చేస్తున్నారు. 8 మంది టెలిఫోన్ నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత మార్చి నెలలో రూ.4.25 లక్షలు, ఏప్రిల్ నెలలో రూ.5.06 లక్షల ఫోన్ బిల్లు వచ్చిందని వెలుగు చూసింది. వీవీఐపీ అతిథులకు ఇదే బడ్జెట్ నుండి ఖర్చు చేస్తామని రాష్ట్రపతి భవన్ స్పష్టం చేసింది.