వచ్చే ఎన్నికల్లో అందరూ ఓటేయాలి, ఈ ఏడాది ఎంతో ప్రత్యేకం: రాష్ట్రపతి గణతంత్రదినోత్సవ సందేశం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశ ప్రజలకు ఆయన 70వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు. మహిళలు, రైతులు సాధికారత సాధిస్తున్నారని చెప్పారు. డిజిటల్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు.
ఈ గణతంత్ర దినోత్సవం మనకు మరెంతో ముఖ్యమని రాష్ట్రపతి పేర్కొన్నారు. వచ్చే అక్టోబర్ 2వ తేదీన జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలు జరుపుకోనున్న తరుణంలో ఈ గణతంత్ర దినోత్సవానికి మనకందరికీ ఎంతో ప్రాధాన్యత కలిగినదని చెప్పారు.
కేవలం భారతదేశానికే కాదని, మహాత్ముడి సూచనలు, మార్గదర్శకం ప్రపంచం మొత్తానికి కూడా అవశ్యమన్నారు. ఈ ఏడాది దేశంలోని ప్రజలందరూ మరో ముఖ్య బాధ్యతను నెరవేర్చాల్సి ఉందని పేర్కొన్నారు. రానున్న 17వ లోకసభ ఎన్నికల్లో అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు. 21వ శతాబ్ధంలో పుట్టిన వారు మొదటిసారి తమ ఓటు హక్కు వినియోగించుకోనున్న ప్రత్యేకమైన ఏడాది ఇది అన్నారు.
నేటి మన నిర్ణయాలే భావి భారతానికి మార్గదర్శకం అన్నారు. జాతీయ వనరులపై అందరికీ హక్కులు ఉన్నాయని చెప్పారు. అన్ని ఇళ్లను విద్యుద్ధీకరించడం శుభపరిణామం అని చెప్పారు. పది శాతం రిజర్వేషన్ల ద్వారా అగ్రవర్ణ పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు.