కొత్త గవర్నర్లు: లిస్ట్లో మాజీ ఐపీఎస్ అధికారి..రిటైర్డ్ లెప్టినెంట్ జనరల్
డెహ్రాడున్: వచ్చే ఏడాది అయిదు పెద్ద రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వాటిల్లో మెజారిటీ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటోంది. ఈ సంవత్సరం నిర్వహించిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేకపోయారు కమలనాథులు. అస్సాంలో అధికారాన్ని నిలబెట్టుకోగా.. తమిళనాడులో ఆ అవకాశం దక్కలేదు. అధికార అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని, ఎన్నికల్లో పోటీ చేసినా పరాజయం నుంచి తప్పించుకోలేకపోయారు.
ఎన్నికలను ఎదుర్కొంటోన్న రాష్ట్రాలకు..
రైతులు పెద్ద సంఖ్యలో ఉన్న రాష్ట్రం పంజాబ్. అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న రాష్ట్రాల్లో ఇదీ ఒకటి. కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో కొనసాగుతోంది. ఆ పార్టీని గద్దె దింపడానికి వ్యూహాలు పన్నుతున్నారు. రైతుల ఆందోళన బీజేపీ నేతలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సుదీర్ఘకాలం పాటు దీక్షలను కొనసాగిస్తోన్న రైతుల్లో మెజారిటీ సంఖ్య పంజాబ్కు చెందిన వారే. ఈ దీక్షల ప్రభావం ఎన్నికలపై పడుతుందనే కలవరం కాషాయ పార్టీ నేతల్లో నెలకొంది.
ఉత్తరాఖండ్లోనూ..
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనే రాష్ట్రాల జాబితాలో ఉత్తరాఖండ్ కూడా ఒకటి. ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది. అతి తక్కువ కాలంలో ఇద్దరు ముఖ్యమంత్రులను మార్చిన రాష్ట్రం.. ఉత్తరాఖండ్. మొదట- ముఖ్యమంత్రిగా పని చేసిన త్రివేంద్ర సింగ్ రావత్ను తప్పించింది బీజేపీ అధిష్ఠానం. ఆయన స్థానంలో లోక్సభ సభ్యుడు తీరథ్ సింగ్ రావత్ను ముఖ్యమంత్రిగా నియమించింది. కొన్ని నెలల తరువాత.. ఆయనను కూడా తప్పించింది. పుష్కర్ సింగ్ ధమీని నియమించింది. అతి తక్కువ కాలంలో చోటు చేసుకున్న ముఖ్యమంత్రుల మార్పుతో కొంత ప్రతికూల పరిస్థితులను బీజేపీ నాయకులు తమకు తాముగా సృష్టించుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
పంజాబ్, ఉత్తరాఖండ్కు
ఈ పరిణామాల మధ్య పంజాబ్, ఉత్తరాఖండ్లకు కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. సుదీర్ఘ కాలంగా తమిళనాడు గవర్నర్గా పనిచేస్తోన్న బన్వరిలాల్ పురోహిత్ పంజాబ్ గవర్నర్గా నియమితులయ్యారు. ఆయన బదిలీ వల్ల ఖాళీ అయిన తమిళనాడు గవర్నర్ స్థానాన్ని ఆర్ఎన్ రవితో భర్తీ చేశారు. ఆర్ఎన్ రవి.. ప్రస్తుతం నాగాలాండ్ గవర్నర్గా పని చేస్తోన్నారు. ఆయన అక్కడి నుంచి తమిళనాడుకు బదిలీ అయ్యారు.
రిటైర్డ్ లెప్టినెంట్ జనరల్కు
పదవీ విరమణ చేసిన లెప్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ ఉత్తరాఖండ్ గవర్నర్గా అపాయింట్ అయ్యారు. ఇదివరకు ఉత్తరాఖండ్కు గవర్నర్గా పనిచేసిన బేబి రాణి మౌర్య.. రెండు రోజుల కిందటే తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో గుర్మీత్ సింగ్ నియమితులయ్యారు. ఆర్ఎన్ రవి తమిళనాడు గవర్నర్గా నియమితులు కావడం ఖాళీ అయిన నాగాలాండ్ గవర్నర్ స్థానంలో కొత్తవారిని నియమించలేదు. అస్సాం గవర్నర్ జగదీష్ ముఖికి ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు.
Recommended Video
ఐపీఎస్ అధికారి..
తమిళనాడు గవర్నర్గా అపాయింట్ అయిన ఆర్ఎన్ రవి.. పూర్తి పేరు రవీంద్ర నారాయణ్ రవి. మాజీ ఐఎఎస్ అధికారి. 1976 బ్యాచ్ కేరళకు క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన. ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా పనిచేస్తూ, 2012లో పదవీ విరమణ చేశారు. 2018లో జాతీయ ఉప భద్రత సలహాదారుగా నియమితులయ్యారు. 2019లో ఆయనను నాగాలాండ్ గవర్నర్గా నియమించింది రాష్ట్రపతి భవన్. నాగా వేర్పాటువాదుల గ్రూపులతో ఆయన చర్చలు నిర్వహించారు. కొంతవరకు అవి ఫలించాయి. రిటైర్డ్ లెప్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్.. డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా పనిచేశారు.