Nirbhaya : అక్షయ్ ఠాకూర్ క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించిన రాష్ట్రపతి
Recommended Video
రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నిర్భయ దోషి అక్షయ్ సింగ్ ఠాకూర్ క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించారు. దీంతో ఇప్పటివరకు ముగ్గురు నిర్భయ దోషుల క్షమాభిక్ష పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ముకేష్,వినయ్ల క్షమాభిక్ష పిటిషన్లను రాష్ట్రపతి ఇదివరకే తిరస్కరించిన సంగతి తెలిసిందే. మరో దోషి పవన్ గుప్తా మాత్రం ఇప్పటివరకు క్యురేటివ్,క్షమాభిక్ష పిటిషన్లను ఇంకా దాఖలు చేయలేదు.
ఇక నిర్భయ దోషుల ఉరిపై ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నిర్భయ దోషులను వేరువేరుగా ఉరితీయొద్దన్న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఉరిశిక్ష అమలుపై స్టే ఎత్తివేసి, దోషులను ఉరితీసేందుకు వీలైనంత త్వరగా డెత్ వారెంట్ జారీ చేసేందుకు ట్రయల్ కోర్టును ఆదేశించాలని పిటిషన్లో కోరింది.
అంతకుముందు కేంద్రం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఉరిశిక్షపై పాటియాలా కోర్టు ఇచ్చిన స్టేను కేంద్రం హైకోర్టులో సవాల్ చేసింది. అయితే పాటియాలా హౌజ్ కోర్టు తీర్పుపై స్టే ఎత్తివేసేందుకు హైకోర్టు నిరాకరించింది.దోషులకు విడివిడిగా ఉరిశిక్ష అమలు చేయడం సాధ్యం కాదని ఢిల్లీ స్పష్టం చేసింది.
కాగా,2012లో డిసెంబర్ 16న ఢిల్లీలో 23 ఏళ్ల నిర్భయపై కదులుతున్న బస్సులో ఆరుగురు అత్యాచారానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. సింగపూర్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిర్భయ కన్నుమూసింది. మొత్తం ఆరుగురు సామూహిక అత్యాచారం చేయగా ఇందులో ప్రధాన నిందితుడు రాంసింగ్ జైలులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరొకరు మైనర్గా ఉండటంతో మూడేళ్లు జువైనైల్ జైలులో శిక్ష అనుభవించి విడుదలయ్యాడు.