రాష్ట్రపతికి కరోనా టెన్షన్.. మెడికల్ టెస్టులు చేయించుకోనున్న కోవింద్..
రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కరోనా వైరస్ వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. ఇప్పటివరకు ఫిక్స్ అయిన అన్ని అపాయింట్మెంట్స్,షెడ్యూల్స్ ఆయన రద్దు చేసుకున్నారు. సింగర్ కనికా కపూర్కు కరోనా పాజిటివ్గా తేలడంతో ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు.. వారి నుంచి ఇతరులకు వైరస్ సోకే ప్రమాదం ఏర్పడింది. ఇటీవలే లండన్ తిరిగొచ్చిన ఆమె ఉత్తరప్రదేశ్ లక్నోలోని ఓ హోటల్లో కుటుంబ సభ్యులు,బంధు మిత్రులు,పలువురు రాజకీయ ప్రముఖులకు పార్టీ ఇచ్చారు.
కనికా కపూర్ పార్టీకి రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే,ఆమె కుమారుడు,ఎంపీ దుష్యంత్ హాజరయ్యారు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ నేత డెరిక్ ఒబ్రెయిన్ హాజరయ్యారు. ఇటీవల ఎంపీ దుష్యంత్ రాష్ట్రపతి భవన్లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సందర్భంగా దుష్యంత్ రాష్ట్రపతి కోవింద్ను కలిశారు. ఆయనతో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కరోనా వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. ఇప్పటికే వసుంధర రాజే,దుష్యంత్ స్వీయ నిర్బంధం(క్వారెంటైన్)లో ఉన్నట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మరోవైపు గాయని ఇచ్చిన పార్టీ నుంచి నేరుగా పార్లమెంటుకు కూడా దుష్యంత్ వెళ్లారు. దాదాపు రెండు గంటల పాటు పార్లమెంటులోనే గడిపారు. దీంతో పార్లమెంట్ సమావేశాలను రద్దు చేయాల్సిందిగా తృణమూల్ ఎంపీ ఒబ్రెయిన్ విజ్ఞప్తి చేశారు.
Recommended Video
ఇక దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 223కి చేరగా.. ఇప్పటివరకు నలుగురు మృత్యువాతపడ్డారు. కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.మహారాష్ట్రలో ఇప్పటి వరకు అత్యధికంగా 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్లో మరో పాజిటివ్ కేసు నమోదు కావడంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 17కు చేరుకుంది.