సొంతూరికి రైలులో రాష్ట్రపతి దంపతులు.. కట్టుదిట్టమైన భద్రత మధ్య జర్నీ..
రాష్ట్రపతి, ప్రధానులు రైళ్లలో ప్రయాణించడం అరుదు. 15 ఏళ్ల క్రితం అబ్దుల్ కలాం పయనించారు. ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ సతీసమేతంగా తన సొంతూరికి ట్రావెల్ చేశారు. సొంతూరు ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్కు ప్రత్యేక రైలులో బయల్దేరారు. ఢిల్లీ సప్ధర్జంగ్ రైల్వేస్టేషన్లో ప్రత్యేక రైలు ఎక్కారు. రాష్ట్రపతి దంపతులకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్, రైల్వేబోర్డు చైర్మన్, సీఈఓ సునీశ్ శర్మ ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయనకు జ్ఞాపికను అందజేశారు.
సొంతూరికి రైలులో..
రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి సొంతూరికి రైలులో వెళ్తున్నారు. శుక్రవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఢిల్లీ నుంచి రాష్ట్రపతి దంపతులు రైలు బయలుదేరి.. సాయంత్రానికి కాన్పూర్ చేరుకుంది. పర్యటనలో రాష్ట్రపతి పాఠశాల స్నేహితులను కలుసుకోనున్నారు. సొంతూరికి వెళ్లిన తర్వాత ఆయన తిరిగి ఈ నెల 28న కాన్పూర్ సెంట్రల్ రైల్వేస్టేషన్ నుంచి రైలులో లక్నోకు వెళతారు.
తిరిగి ఫ్లైట్..
పర్యటన తర్వాత 29వ తేదీన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరిగి వస్తారు. 15ఏళ్ల తర్వాత రాష్ట్రపతి రైల్లో ప్రయాణించడం తొలిసారి. 2006లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం రాజధాని ఢిల్లీ నుంచి డెహ్రాడూన్కు రైలులో ప్రయాణించారు.
బూస్టింగ్..
గతంలో పనిచేసిన రాష్ట్రపతులు అనుసరించిన మార్గాన్ని కోవింద్ కంటిన్యూ చేశారు. కోవింద్ పర్యటన రైల్వే సిబ్బందికి బూస్టింగ్ అవుతుందని ఐఆర్సీటీసీ సీపీవో దీపక్ కుమార్ తెలిపారు. సిబ్బందిలో ఉత్సాహం నింపడంతోపాటు.. ప్రజలు కూడా రైలు ప్రయాణం చేసేలా చేస్తుందని చెప్పారు. పర్యాటక, వ్యాపారం కోసం ట్రావెల్ చేయొచ్చు అని చెప్పారు.
భద్రత కట్టుదిట్టం
రాష్ట్రపతి దంపతులు రైలులో ప్రయాణించే సమయంలో తగిన భద్రతను తీసుకున్నారు. నాలుగు అంచెల ప్రొటెక్షన్ ఇచ్చారు. 100 మంది స్నిప్పర్స్, 80 మంది స్పెషల్ కమాండెలను మొహరించారు. పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీస్.. 10 జిల్లాల్లో మొహరించారు. రైలు ప్రయాణించే మార్గంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలించారు.