బాహుబలి ఉత్సవాలు: 88వ మహామస్తకాభిషేకం ప్రారంభించిన రాష్ట్రపతి, 20 రోజులు!
బెంగళూరు: కర్ణాటకలోని హాసన్ జిల్లా చెన్నరాయణపట్టణ తాలుకాలోని శ్రవణబెళగోళలో బాహుబలి 88వ మహామస్తకాభిషేక ఉత్సవాలను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బుధవారం ప్రారంభించారు. శ్రవణబెళగోళలోని చావుండాయ మండపంలోని చిన్న గోమటేశ్వరుడు (బాహుబలి)కి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రత్యేక పూజలు చేసి, దీపం వెలిగించి అధికారికంగా 88వ మహామస్తకాభిషేక బాహుబలి ఉత్సవాలు ప్రారంభించారు.
12 ఏళ్లకు ఒక్క సారి
శ్రవణబెళగోళలోని దిగంబర వైరాగ్యమూర్తి గేమటేశ్వరుడి (బాహుబలి)కి 12 ఏళ్లకు ఒకసారి మహామస్తకాభిషేకాలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 7వ తేదీ బుధవారం ప్రారంభం అయిన మహామస్తకాభిషేక ఉత్సవాలు ఫిబ్రవరి 27వ తేదీ వరకు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.
సతీసమేతంగా హాజరు
శ్రవణబెళగోళలోని బాహుబలి మహామస్తకాభిషేక ఉత్సవాలు ప్రారంభించడానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయన సతీమణి సవితా కోవింద్ తో సహా హాజరైనారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ భార్యతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.
సంతోషంగా ఉంది
12 ఏళ్లకు ఒక సారి బాహుబలికి జరిగే మహామస్తకాభిషేక ఉత్సవాలు ప్రారంభించడం చాల సంతోషంగా ఉందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. శ్రవణబెళగోళలోని బాహుబలి చరిత్ర ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిందని రామ్ నాథ్ కోవింద్ అన్నారు.
ప్రభుత్వ ఏర్పాట్లు
బాహుబలి (గోమటేశ్వరుడు) మహామస్తకాభిషేక ఉత్సవాలు ఈనెల 27వ తేదీ వరకు వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా వసతి ఏర్పాటు చేశామని, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి 300 ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశామని సిద్దరామయ్య చెప్పారు.
మద్య నిషేదం
20 రోజుల పాటు శ్రవణబెళగోళలో బాహుబలికి మహామస్తకాభిషేక ఉత్సవాలు జరుగుతున్న సందర్బంగా పరిసర ప్రాంతాల్లోని 5 కిలోమీటర్ల పరిధిలో మద్య నిషేదం విధించారు. అక్రమంగా ఎవరైనా మద్యం విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. 20 రోజుల పాటు ప్రతిరోజూ వివిధ సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
మాజీ ప్రధాని, ప్రముఖులు హాజరు
గోమటేశ్వరుడి మహామస్తకాభిషేక ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ, కర్ణాటక గవర్నర్ వాజుబాయ్ వాలా, హాసన్ జిల్లా ఎన్ చార్జ్ మంత్రి ఎ. మంజు, ధర్మస్థలం ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే, హాసన్ జిల్లాధికారి రోహిణి సింధూరి, చారుకీర్తి భట్టరక స్వామిజీ, 100 మంది ప్రముఖ జైన్ మత దిగంబరులతో సహ అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు.