కేంద్ర కేబినెట్ ఆమోదం: జమ్ము కశ్మీర్లో మరో ఆరునెలల పాటు రాష్ట్రపతి పాలన
జమ్ముకశ్మీర్లో మరో ఆరునెలల పాటు రాష్ట్రపతి పాలన కొనసాగించాలని కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయించింది. జూన్ 20 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. న్యూఢిల్లీలో కేబినెట్ సమావేశం తర్వాత కేంద్రమంత్రి ప్రకాష్ జవడేకర్ ప్రకటించారు. డిసెంబర్ 19,2018 నుంచి జమ్ము కశ్మీర్ రాష్ట్రపతి పాలనలో ఉంది. అంతకుముందు అది గవర్నర్ పాలనలో ఉండేది. సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు రావడంతో పీడీపీ ప్రభుత్వం పడిపోయింది. ఇక అప్పటి నుంచి జమ్ముకశ్మీర్లో రాజకీయ అనిశ్చితి నెలకొంది.
ఇక జమ్ము కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరిగే అవకాశం ఉంది. అమర్నాథ్ యాత్ర ముగిసిన తర్వాత ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. జమ్ముకశ్మీర్లో వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి ఎన్నికల నిర్వహణపై ఒక ప్రకటన చేస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. అన్ని వర్గాల నుంచి సమాచారం సేకరించి అమర్నాథ్ యాత్ర తర్వాత జమ్ముకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం వివరించింది.
ఇదిలా ఉంటే జూలై 1 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. దీనికోసం పాలనాయంత్రాంగం అంతా పనిలో నిమగ్నమై ఉంది. అంతేకాదు భద్రతా దళాలు కూడా అమర్నాథ్ యాత్రలో నిమగ్నమై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఎన్నికల సంఘం చెప్పింది. అమర్ నాథ్ యాత్ర దారి లఖన్పూర్ నుంచి కశ్మీర్ లోయ మధ్యలో ఉన్నందున భద్రతా దళాలు అక్కడ పహారా కాస్తాయి. అంతేకాదు బల్టాల్, పహల్గాంలలో కూడా భద్రతా దళాల అవసరం ఉంటుంది. యాత్ర ప్రారంభానికి పక్షం రోజుల ముందు ప్రభుత్వం అక్కడ భద్రతాదళాలను గస్తీకి పంపుతుంది.