హోంశాఖకు గవర్నర్ రిపోర్ట్: యుపిలో రాష్ట్రపతి పాలన?
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని ఉత్తరప్రదేశ్ గవర్నర్ బిఎల్ జోషి కేంద్ర హోంశాఖకు పంపిన పలు నివేదికల్లో వెల్లడించిన సమాచారం. రాష్ట్రంలో రాష్టప్రతి పాలన విధించాలని బిఎస్పీ అధినేత్రి మాయావతితోపాటు పలువురు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో పెచ్చుమీరుతోన్న గ్యాంగ్రేప్లు, రాజకీయ నేతలపై కొనసాగుతున్న దాడులు కేంద్రాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్లోని బదౌన్తోపాటు పలు ప్రాంతాల్లో మహిళలపై అత్యాచారాలు కొనసాగుతున్నాయి. బదౌన్లో ఇద్దరు బాలికలను అత్యాచారం చేయటంతోపాటు చెట్టుకు ఉరి తీయటంపై జాతీయస్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో అందోళన వ్యక్తమైంది. ఐక్యరాజ్యసమితి సైతం ఉత్తరప్రదేశ్లో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల పట్ల ఆందోళన వ్యక్తం చేయటంతోపాటు మహిళల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ ఏకంగా కేంద్రానికి అధికారికగా లేఖ రాసింది.
మహిళలకు గౌరవ ప్రదమైన జీవితం గడిపే హక్కు, అవకాశం కల్పించాలంటూ ఐక్యరాజ్య సమితి చేసిన సూచన కేంద్రాన్ని ఆందోళనకు గురిచేసింది. ఉత్తరప్రదేశ్లో నెలకొన్న ఆటవిక రాజ్యం మూలంగా అంతర్జాతీయ స్థాయిలో దేశం, పరువు ప్రతిష్టకు భంగం వాటిల్లటం పట్ల కేంద్రం ఆందోళన చెందుతోంది. యుపిలో పరిస్థితి ఇలాగే కొనసాగితే ఐక్యరాజ్య సమితితోపాటు ఇతర దేశాలూ స్పందిస్తే దేశం పరువు ప్రతిష్ట మంటగలుస్తుందని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం భావిస్తోంది. పరిస్థితి మరింత దిగజారక ముందే తగు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.
యుపి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ రాష్ట్ర ప్రజలకు, మహిళలకు భద్రత కల్పించటంలో ఘోరంగా విఫలమవుతున్నారు. రేప్లకు పాల్పడుతున్న వారిని సకాలంలో అరెస్టు చేయించలేకపోతున్నారని కేంద్రం భావిస్తోంది. రాష్ట్రంలో గత నెల, పదిహేను రోజుల కాలంలో 20కి పైగా అత్యాచారాలు జరిగాయి, అత్యాచారానికి గురైన వారిలో సగంమంది హత్యకు గురయ్యారు. పోలీసులు అరెస్టు చేసిన తన భర్తను విడిపించుకునేందుకు స్టేషన్కు వెళ్లిన యువతిని నలుగురు కానిస్టేబుళ్లు స్టేషన్లోనే దారుణంగా రేప్ చేయటం ఉత్తరప్రదేశ్లో నెలకొన్న భయానక పరిస్థితులకు అద్దం పడుతోంది.
ఓ వైపు అత్యాచారాలు అడ్డూఅదుపు లేకండా కొనసాగుతుంటే మరోవైపు రాజకీయ నేతలు ముఖ్యంగా బిజెపి నేతలపై దాడులు పెరిగిపోతున్నాయి.. బిజెపికి చెందిన ఒక పార్లమెంటు సభ్యుడిపైనా దాడి జరిగింది. ముగ్గురు బిజెపి నేతలు హత్యకు గురయ్యారు. ఇన్ని దారుణాలు జరుగుతున్నా సమాజ్వాదీ అధ్యక్షుడు, లోక్సభ సభ్యుడు ములాయం సింగ్ యాదవ్, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాత్రం శాంతి భద్రతల పరిస్థితులను చక్కదిద్దే చర్యలు తీసుకోకుండా, మీడియాను తప్పుపట్టడం గమనార్హం.
కాగా, అఖిలేష్ యాదవ్ ఎన్ని కథలు చెబుతున్నా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. రాష్ట్రంలో పరిస్థితి ఇకమీదట ఏమాత్రం దిగజారినా రాష్టప్రతి పాలన తప్పదని హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి.