కేజ్రీవాల్ రాజీనామా ఆమోదం, ఢిల్లీలో రాష్ట్రపతి పాలన
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. దీంతో సోమవారం నుండి ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది.
కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ ఈ విషయాన్ని తెలిపారు. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ నజీబ్ జంగ్ రాసిన లేఖను ప్రణబ్ ముఖర్జీ ఆమోదించినట్లుగా షిండే తెలిపారు. కేజ్రీవాల్ రాజీనామాను ప్రణబ్ ఆమోదించాక అసెంబ్లీని సుప్తాచేతనావస్థనలో ఉంచారు.
అరవింద్ కేజ్రీవాల్ ఈ నెల 14వ తేదీన తన పదవికి రాజీనామా చేశారని షిండే గుర్తు చేశారు.
జన్ లోక్పాల్ బిల్లును తీసుకు రాకుంటే తాను రాజీనామా చేస్తానని కేజ్రీవాల్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన నాలుగు రోజుల క్రితం రాజీనామా చేశారు. దానిని ప్రణబ్ ఆమోదించారు. కేజ్రీవాల్ ప్రభుత్వం 49 రోజుల పాటు ఢిల్లీలో పాలన చేసింది.
గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెసును మట్టికరిపించి, బిజెపితో పోటీ పడి ఎఎపి 28 స్థానాలను ఢిల్లీలో గెలుచుకున్న విషయం తెలిసిందే. బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రాకపోవడంతో కాంగ్రెసు మద్దతుతో కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యారు.