పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన... గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం...
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర కేబినెట్ గురువారం(ఫిబ్రవరి 25) నోటిఫికేషన్ జారీ చేసింది. పుదుచ్చేరిలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయడం... కేంద్ర కేబినెట్ అందుకు ఆమోదం తెలపడం తెలిసిందే. కేంద్ర కేబినెట్ నిర్ణయానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేయడంతో కేంద్రం హోంమంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించడం ఇది ఏడోసారి కావడం గమనార్హం.
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి కొత్త అసెంబ్లీ కొలువుదీరేంత వరకూ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులో ఉండనుంది. మొత్తం 33 మంది సభ్యులున్న పుదుచ్చేరి అసెంబ్లీలో ప్రభుత్వ బలం 12కు పడిపోయిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలను బుజ్జగించడానికి సీఎం నారాయణ స్వామి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీంతో బలపరీక్షలో నారాయణస్వామి ఓడిపోయారు.అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ కూడా ముందుకు రాకపోవడంతో... ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు. త్వరలోనే పుదుచ్చేరిలో ఎన్నికలు ఉండటంతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ కూడా ముందుకు రాలేదు.
'ఈ దశలో మేము ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించం. త్వరలో జరగనున్న పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రజల ఆశీస్సులతో ఎన్డీయే ఇక్కడ అధికారంలోకి వస్తుంది. అన్నాడీఎంకెతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.' అని పుదుచ్చేరి బీజేపీ అధ్యక్షుడు వి.స్వామినాథన్ పేర్కొన్నారు.అటు కాంగ్రెస్ కూడా మరోసారి అధికారంలోకి వచ్చేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తోంది.
మరోవైపు గురువారం పుదుచ్చేరిలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై,పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కొద్దిరోజుల క్రితం పుదుచ్చేరికి చెందిన ఓ తుఫాన్ బాధితురాలి వీడియో వైరల్గా మారిందని... అందులో ఆమె ఆవేదన కనిపించిందని అన్నారు. కానీ పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి మాత్రం ఆమె మాటలను తప్పుగా ట్రాన్స్లేట్ చేసి చెప్పారని అన్నారు. అసలు అబద్దాల పునాది మీద ఏర్పడిన పార్టీ ప్రజలను ఉద్దరిస్తుందని ఎలా ఆశిస్తామన్నారు.
2016లో పుదుచ్చేరిలో ఏర్పడిన ప్రభుత్వం ప్రజలకు సేవ చేయడం బదులు ఢిల్లీలోని ఆ పార్టీ అధిష్టానానికి సేవ చేస్తోందని మోదీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేత ఒకరు ఇక్కడికొచ్చి మత్స్య శాఖ ఏర్పాటు చేస్తానని చెప్పారని... ఆ వ్యాఖ్యలకు తాను షాక్ తిన్నానని అన్నారు. కేంద్రంలో ఇప్పటికే మత్స్యశాఖ ఉందన్నారు. 2019లోనే ఎన్డీయే ప్రభుత్వం ఫిషరీస్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయినందుకు ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు.
Ministry of Home Affairs notifies President's Rule in Puducherry, issues gazette notification pic.twitter.com/dQKiGSo6Lr
— ANI (@ANI) February 25, 2021