President's Rule: రాష్ట్రపతి పాలనలో మహారాష్ట్ర: సంక్షోభానికి అనూహ్య తెర
న్యూఢిల్లీ/ముంబై: సుమారు 20 రోజులుగా మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి అనూహ్యంగా తెర పడింది. ఈ సంక్షోభానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దీనికి ముగింపు పలికారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. తక్షణమే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను విధించాలని కోరుతూ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి కేంద్రానికి సిఫారసు చేయడం, దాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించడం, ఆ సిఫారసులపై రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం చకచకా సాగిపోయాయి. ఖచ్చితంగా చెప్పాలంటే- నాలుగే నాలుగు గంటల వ్యవధిలో మహారాష్ట్ర సంక్షోభానికి తెర పడినట్టయింది.
President's rule: షాకింగ్ ట్విస్ట్: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు: గడువు దాటిన మరుక్షణమే..
ఆమోదం తెలిపిన రాష్ట్రపతి
మహారాష్ట్రలో ఈ నెల 23వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. రోజుకో మలుపు తిరుగుతూ వచ్చాయి మహారాష్ట్ర రాజకీయాలు. శివసేనతో కలిసి ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకోవడానికి బీజేపీ ససేమిరా అనడం, ముఖ్యమంత్రి పీఠాన్ని చెరో రెండున్నరేళ్ల కాలం పాటు పంచుకుంటే తప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కమలనాథులకు మద్దతు ఇవ్వబోమంటూ శివసేన భీష్మించడం వల్ల ప్రతిష్ఠంభన నెలకొంది. దీన్ని పరిష్కరించడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.
కాంగ్రెస్-ఎన్సీపీల జాప్యం సైతం..
శివసేనతో కాంగ్రెస్-ఎన్సీపీల కూటమి కలిస్తే సులువుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. అయినప్పటికీ.. కాంగ్రెస్-ఎన్సీపీలు జాప్యం చేశాయనే అంటున్నారు. శివసేనతో చేతులు కలపడం వల్ల కలిగే లాభనష్టాలను బేరీజు వేసుకుంటూ కూర్చోవడాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంది. మరింత జాప్యాన్ని కొనసాగినిచ్చింది. చివరికి దాన్నే అస్త్రంగా ప్రయోగించింది. 20 రోజుల పాటు ప్రభుత్వం లేకపోవడాన్ని కారణంగా చూపుతూ.. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను విధించేలా చేసింది కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం. ఈ వ్యవహారం పట్ల రాజకీయ పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. ఏ కారణంతో రాష్ట్రపతి పాలన విధిస్తారనే నిలదీస్తున్నాయి. శివసేన సుప్రీంకోర్టులో న్యాయ పోరాటానికి దిగింది.
గడువు ఉన్నప్పటికీ..
మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ కోష్యారి.. శివసేనకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఆదివారం సాయంత్రం ఆయన శివసేనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని ఇచ్చారు. సోమవారం రాత్రి 7:30 గంటల వరకు గడువును ఇచ్చారు. అధికారాన్ని అందుకోవడానికి అవసరమైన 145 స్థానాలు సంఖ్యాబలం శివసేనకు లేదు. ఈ నేపథ్యంలో- కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ (ఎన్సీపీ)లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శివసేన నిర్ణయించుకుంది. కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు రాలేదు. ఈ నేపథ్యంలో గడువును మంగళవారం రాత్రి 8:30 గంటల వరకూ పొడిగించారు. గడువు ఉన్నప్పటికీ.. రాష్ట్రపతి పాలన విధించడాన్ని తప్పుపడుతున్నాయి.