రాష్ట్రపతి పాలన దిశగా మహారాష్ట్ర: మా బంధం ఫెవికాల్, సిమెంట్ కంటే దృఢం: బీజేపీ
ముంబై: ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్ఠంభన నెలకొన్న నేపథ్యంలో..మహారాష్ట్ర క్రమంగా రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు వేస్తోందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నెల 7వ తేదీ నాటికి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు కాలేకపోతే.. రాష్ట్రపతి పాలనను విధించడానికి అవకాశాలు లేకపోలేదని భారతీయ జనతాపార్టీ నాయకులు తేల్చి చెబుతున్నారు. ప్రస్తుత అసెంబ్లీ కాల పరిమితి 8వ తేదీన ముగియబోతోందని, ఈ లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందని అంటున్నారు. దీన్ని శివసేన తేలిగ్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే ప్రతిపాదించిన 50-50 ఫార్ములాకే తాము కట్టుబడి ఉన్నామని, రాష్ట్రపతి పాలన విధించినా పట్టించుకోబోమని అంటున్నారు.
మహారాష్ట్ర సీఎంగా శివసేన అభ్యర్థే ఉంటారు: సంజయ్ రౌత్ షాకింగ్ స్టేట్మెంట్
రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయనున్న కేంద్రం..
మహారాష్ట్రలో అసెంబ్లీ ఫలితాలు వెలువడి వారం రోజులు కావస్తోంది. ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ, దాని మిత్రపక్షం శివసేన మధ్య నెలకొన్న చిక్కుముడి వీడట్లేదు. ఎవరికి వారు తాము పట్టిన పట్టును వీడటానికి ఎంత మాత్రం సుముఖంగా లేరు. మరోవంక- ప్రస్తుత అసెంబ్లీ కాల పరిమితి ఈ నెల 8వ తేదీన ముగియబోతోంది. ఈ లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. అసెంబ్లీ గడువు ముగిసే నాటికి ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే.. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఖాయమని, రాష్ట్రపతి పాలనను విధించడానికి సిఫారసు చేస్తుందని బీజేపీ సీనియర్ నాయకుడు, ఆర్థిక శాఖ మంత్రి సుధీర్ ముంగంటివర్ కుండబద్దలు కొట్టారు.
మా బంధం ఫెవికాల్ కంటే దృఢం..
శుక్రవారం ఉదయం ఆయన బీజేపీ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. శివసేనతో కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. శివసేనతో తమకు ఉన్న బంధం ఫెవికాల్, అంబుజా సిమెంట్ కంటే దృఢమైనదని, దీన్ని ఎవరూ ధ్వంసం చేయలేరని అన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో శివసేనతో చర్చలను కొనసాగించాల్సి ఉందని, దీపావళి పండుగ సందర్భంగా జాప్యం ఏర్పడిందని చెప్పారు. 5వ తేదీ నాటికి శివసేనతో ఓ అవగాహనకు వస్తామని, 7లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే విశ్వాసం తమకు ఉందని అన్నారు. రాష్ట్రపతి పాలన విధించడంమంటూ జరిగితే రెండు పార్టీలు నష్టపోతాయని వ్యాఖ్యానించారు.
శివసేన మెట్టు దిగొచ్చు..
శివసేన నాయకులతో తాము త్వరలోనే సంప్రదింపులను చేపడతామని సుధీర్ వెల్లడించారు. ఈ దఫా చర్చల సందర్భంగా శివసేన బెట్టు వీడే అవకాశాలు ఉండొచ్చని ఆయన అంచనా వేశారు. ముఖ్యమంత్రి పదవిని రెండు పార్టీలు చెరో రెండున్నరేళ్ల కాలం పాటు అనుభవించాలనే డిమాండ్ కు శివసేన కట్టుబడి ఉందని, తాము దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పారు. ఈ ప్రత్యామ్నాయ ప్రతిపాదనల అనంతరం శివసేన మెట్టు దిగడానికి అవకాశం ఉందని తాను భావిస్తున్నట్లు సుధీర్ అభిప్రాయపడ్డారు. తమ పార్టీ తరఫున దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారని, ఇందులో ఎలాంటి మార్పూ ఉండబోదని స్పష్టం చేశారు.