రాష్ట్రపతి ఎన్నికపై ఏకమైన విపక్షాలు: ఎన్డీఏ తర్వాతే తామన్న మమత, నితీష్ డుమ్మా
రాష్ట్రపతి అభ్యర్థిపై ఎన్డీఏ నిర్ణయం తీసుకున్న తర్వాతే తాము తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థిపై ఎన్డీఏ నిర్ణయం తీసుకున్న తర్వాతే తాము తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. విపక్షాల తరఫున ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టేందుకు యత్నిస్తున్న విపక్ష పార్టీలు న్యూడిల్లీలో శుక్రవారం సమావేశమయ్యాయి.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. విపక్ష సభ్యులకు ఆమె విందు కూడా ఇచ్చారు. కాగా, ఈ సమావేశానికి దాదాపు 17 పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై వారు చర్చించారు. అనంతరం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై సమాలోచనలు సాగుతున్నాయని వెల్లడించారు.
ఎన్డీఏ తమ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత తాము తుది నిర్ణయం చెబుతామని తెలిపారు. వారు ప్రకటించే అభ్యర్థి అందరికీ ఆమోదయోగ్యమైతే తమకెలాంటి అభ్యంతరం లేదని మమత పేర్కొన్నారు. అయితే, ఈ సమావేశానికి జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, సమాజ్ వాదీ పార్టీ నేతలు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్లు గైర్హాజరవడం గమనార్హం.
కాగా, బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి ఇప్పటి వరకూ రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టే అంశంపై ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. టీఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్డీయే అభ్యర్థికే మద్దతిస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తమిళనాడులోని అధికార అన్నాడీఎంకే రెండు వర్గాలు కూడా బీజేపీ అభ్యర్థికే మద్దతు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.