రాష్ట్రపతి పదవికి పోటీ తప్పదు: ఏచూరీ, సంతోషమన్న నితీష్
రాష్ట్రపతి పదవికి పోటీ తప్పదని విపక్షాలు స్పష్టంచేశాయి. బీజేపీ తన అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే.జూన్ 22న జరిగిన సమావేశంలో చర్చించి రాష్ట్రపతి అభ్యర్థిపై నిర్ణయం ప్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి పదవికి పోటీ తప్పదని విపక్షాలు స్పష్టంచేశాయి. భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ పేరును ప్రకటించిన నేపథ్యంలో దేశ అత్యున్నత పదవి పోటీకి అభ్యర్థిని నిలబెట్టే అంశంపై జూన్ 22న జరిగిన సమావేశంలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ తెలిపాయి.
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. రాష్ట్రపతి పదవికి పోటీ తప్పదని, విపక్ష పార్టీ సభ్యులంతా జూన్ 22న భేటీ అయి అభ్యర్థిని ప్రకటిస్తామని స్పష్టంచేశారు. సీపీఐ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది.
ప్రతిపక్షాలన్నీ ఏకమై అభ్యర్థిని నిలబెట్టాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి అన్నారు. ఎన్టీయే తరఫున బీజేపీ నిలబెట్టిన రామ్నాథ్కోవింద్కు ఆర్ఎస్ఎస్ మూలాలున్నాయని అన్నారు. ఆర్ఎస్ఎస్ అభ్యర్థిని రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉంచవద్దని ఇటీవలే తమను కలిసిన త్రిసభ్య కమిటీకి చెప్పామని తెలిపారు.అందుకే ఇతర పార్టీలతో చర్చించి అభ్యర్థిని ప్రకటిస్తామని సురవరం తెలిపారు.
కాగా, ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా బీహార్ గవర్నర్ రామ్నాథ్ కోవింద్ను ఎంపిక చేయడం సంతోషకర విషయమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్కుమార్ అన్నారు. అయితే అభ్యర్థికి మద్దతిచ్చే విషయంలో మిత్రపక్షమైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్తోనూ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాతోనూ చర్చించి తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తానని తెలిపారు.