ఎన్డీఏ అభ్యర్థికి పోటీ తప్పదన్న విపక్షాలు.. 22న భేటీ, అభ్యర్థి ప్రకటన
బీజేపీ తన అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ పేరును ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రపతి పదవికి పోటీ తప్పదని విపక్షాలు స్పష్టం చేశాయి. ఈ నెల 22న ఏకగ్రీవంగా ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నాయి.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి పదవికి పోటీ తప్పదని విపక్షాలు స్పష్టం చేశాయి. బీజేపీ తన అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ పేరును ప్రకటించిన నేపథ్యంలో దేశ అత్యున్నత పదవి పోటీకి అభ్యర్థిని నిలబెట్టే అంశంపై ఈ నెల 22న జరిగిన సమావేశంలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ తెలిపాయి.
ఈ నెల 22న సాయంత్రం 4.30 గంటలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో విపక్ష పార్టీల సమావేశం జరుగబోతోంది. ఇప్పటికే అందరికీ సమాచారం అందింది. విపక్షాలన్నీ ఒకేతాటిపై ఉన్నాయి. ఈ నెల 22న ఏకగ్రీవంగా ఒక నిర్ణయం తీసుకోనున్నారు.
ఎలాంటి వ్యాఖ్యా చేయదలచుకోలేదు..
ఏన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిపై తమ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ చెప్పారు. ఎన్డీయే ఎంపికపై ఎలాంటి వ్యాఖ్యా చేయదలచుకోమలేదన్నారు. ఏదైనా నిర్ణయం తీసుకొనే ముందు అన్ని విపక్ష పార్టీలతో మాట్లాడాల్సి ఉందన్నారు.
ఎన్డీఏ అభ్యర్థికి పోటీ తప్పదు...
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. రాష్ట్రపతి పదవికి పోటీ తప్పదని, విపక్ష పార్టీ సభ్యులంతా ఈ నెల 22న భేటీ అయి అభ్యర్థిని ప్రకటిస్తామని స్పష్టంచేశారు.
ఆరెస్సెస్ అభ్యర్థిని వద్దన్నాం.. అయినా..
ప్రతిపక్షాలన్నీ ఏకమై రాష్ట్రపతి పదవికి ఒక అభ్యర్థిని నిలబెట్టాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి అన్నారు. ఎన్టీయే తరఫున బీజేపీ నిలబెట్టిన రామ్నాథ్ కోవింద్కు ఆరెస్సెస్ మూలాలున్నాయని అన్నారు. ఆరెస్సెస్ అభ్యర్థిని రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉంచవద్దని ఇటీవలే తమను కలిసిన త్రిసభ్య కమిటీకి చెప్పామన్నారు. అందుకే ఇతర పార్టీలతో చర్చించి అభ్యర్థిని ప్రకటిస్తామని సురవరం తెలిపారు.
సుష్మ, అద్వానీ పేర్లను ప్రకటించాల్సింది..
ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్కోవింద్ పేరు ప్రకటించడంపై పశ్చిమ్బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తంచేశారు. అత్యున్నత పదవికి ఒక దళితుడిని ఎంపిక చేశామని బీజేపీ చెప్తోందన్నారు. అయితే, కోవింద్ బీజేపీకి చెందిన దళిత్ మోర్చా నాయకుడని, అందుకే ఆయన పేరును ఎంపిక చేశారని విమర్శించారు. రామ్నాథ్కు మించిన దళిత నేతలు దేశంలో చాలా మందే ఉన్నారన్నారు. సుష్మాస్వరాజ్ పేరునో, అద్వానీ పేరునో సూచించాల్సిందని పేర్కొన్నారు. లేకపోతే ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ను రెండోసారి కొనసాగించినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆమె స్పష్టం చేశారు.
సంతోషం.. అయితే ఇప్పుడే చెప్పలేను..
ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా బీహార్ గవర్నర్ రామ్నాథ్ కోవింద్ను ఎంపిక చేయడం సంతోషకర విషయమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్కుమార్ అన్నారు. అయితే అభ్యర్థికి మద్దతిచ్చే విషయంలో మిత్రపక్షమైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్తోనూ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాతోనూ చర్చించి తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తానని చెప్పారు.