ఆఫీసర్లే నా కాళ్లు మొక్కుతారు, ఇలా చేస్తే నా స్కూల్లో ప్రిన్సిపల్గా చేస్తా!: ఆ బాలికతో ఆశారాం
న్యూఢిల్లీ: తనను తాను అవతార పురుషుడుగా చెప్పుకొంటూ ఓ వెలుగు వెలిగిన ఆశారాం బాపును అత్యాచారం కేసులో జోధ్పూర్ ఎస్సీ/ఎస్టీ న్యాయస్థానం బుధవారం దోషిగా తేల్చింది. పదహారేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొన్న అతినకి జీవిత ఖైదు విధించింది. మరణించేంత వరకు జైల్లోనే ఉండాలని తీర్పు చెప్పింది.
ఆశారాం కేసు: వెనుక నుండి రాత్రిపూట ఆశ్రమంలోకి అమ్మాయిలు, ఆ సాక్ష్యమే కీలకం
ఆశారాంకు జీవిత ఖైదు పడటం పట్ల బాధిత బాలిక తండ్రితో పాటు ఆమె చదివిన పాఠశాల ప్రిన్సిపల్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కేసులో సాక్షి అయిన ప్రిన్సిపల్... ఆశారాం అనుచరుల నుంచి బెదిరింపులు ఎదుర్కొన్నారు. తీర్పు నేపథ్యంలో తనకు భద్రత పెంచే అంశాన్ని పరిశీలించాలని అధికారులను కోరారు.
బెదిరింపులు వచ్చాయి
ఆశారాంకు అనుకూలంగా బాలిక పుట్టిన తేదీని మార్చాలంటూ తనను తీవ్రంగా బెదిరించారని ప్రిన్సిపల్ వెల్లడించారు. తుపాకీ గొట్టాలను కూడా పంపించేవారన్నారు. పాఠశాల అంటే అందరికీ ఎంతో విశ్వాసం అని దానిని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యచత తమపై ఉందన్నారు. తనకు బెదిరింపు లేఖలు కూడా వచ్చాయన్నారు.
ఆ బాలిక... ఇదీ జరిగింది
యూపీలోని షాజహాన్పుర్కు చెందిన ఓ బాలిక మధ్యప్రదేశ్లోని ఛింద్వాడాలో ఉన్న ఆశ్రమంలో చదువుకునేది. ఆమె కుటుంబం ఆశారాంను ఎంతగానో నమ్ముకునేది. 2013 ఆగస్టు 15 రాత్రి జోధ్పుర్ సమీపంలోని మనాయి ప్రాంతంలో ఉన్న ఆశ్రమానికి తనను పిలిచి ఆశారాం అత్యాచారానికి ఒడిగట్టినట్లు ఆ బాలిక ఫిర్యాదు చేసింది. సెప్టెంబరు 1న ఇండోర్లో ఆశారాం బాపూను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అతనిని జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. నవంబరు 6న ఆశారాం, మరో నలుగురిపై పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చేశారు. తొలుత జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ అనంతరం కేసును జోధ్పుర్ ఎస్సీ/ఎస్టీ కేసుల న్యాయస్థానానికి బదిలీ చేశారు. ఈ నెల 17న కోర్టు తుది వాదనలు విన్నది. బుధవారం తీర్పు చెప్పింది. ఈ కేసులో ముగ్గురు సాక్షులు హత్యకు గురికాగా, పలువురిపై దాడులు జరగడంతో పాటు తీవ్రంగా బెదిరింపులొచ్చాయి. ఆశారాం అనుచరులతో పాటు, అతని కుమారుడు నారాయణ్ సాయిపైనే ఈ ఆరోపణలున్నాయి.
వేలాది బెదిరింపు లేఖలు, రాజకీయ ఒత్తిళ్లు లేవు
ఆశారాం బాపు కేసులో తమకు బెదిరింపుల వచ్చాయని దర్యాఫ్తు అధికారి లాంబా తెలిపారు. రెండు వేలకు పైగా బెదిరింపు లేఖలు వచ్చాయన్నారు. వందలాది మంది ఫోన్లు చేశారన్నారు. ఈ బెదిరింపుల కారణంగా తాను కొన్నాళ్ల పాటు తన పాపను స్కూల్కు పంపించలేదని, భార్య ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టలేదన్నారు. తనకు వచ్చిన బెదిరింపు లేఖల్లో బూతులు ఉండేవన్నారు. ఈ కేసుకు సంబంధించి ఓ సాక్షిని చంపిన నిందితుడు తన తదుపరి టార్గెట్ నేనే అని చెప్పేవాడన్నారు. ఈ కేసులో తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు రాలేదన్నారు.
ఆశారాం హోర్డింగ్ తొలగింపు
ఆశారాంకు జైలు శిక్ష నేపథ్యంలో భోపాల్లోని ఓ బస్టాండు వద్ద అతని పేరిట ఉన్న హోర్డింగును తొలగించారు. ఆశారాం పేరిట ఉన్న ప్రాంతాలు, నిర్మాణాల పేర్లను మార్చాలని కొందరు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. చర్యలు చేపడతామన్నారు.
ఆఫీసర్లే నా కాళ్లు మొక్కుతారు
కాగా, బాధిత బాలిక ఆశారాంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు అతను బెదిరించిన తీరును ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తనను ఏం చదువుతావని అడిగితే సీఏ అవ్వాలని ఉందని చెప్పానని, అప్పుడు ఆశారాం... ఎందరో పేరున్న ఆఫీసర్లే నా కాళ్లు మొక్కుతారని, సీఏ చదివి నువ్వేం చేస్తావని అన్నాడని తెలిపారు. బీఈడీ చేయాలని తనను బెదిరించాడని, అలా చేస్తే అతని పాఠశాలలో తొలుత టీచర్ను చేసి ఆ తర్వాత ప్రిన్సిపల్ను చేస్తానని చెప్పాడని ఫిర్యాదులో పేర్కొంది.