అయోధ్య రామ మందిరానికి రాష్ట్రపతి తొలి విరాళం: వజ్రాల వ్యాపారి భారీ మొత్తం
న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాల సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది. మొట్ట మొదటి విరాళం దేశ ప్రథమ పౌరుడి నుంచి సేకరించింది ఆలయ ట్రస్ట్. శుక్రవారం భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రామ మందిర నిర్మాణానికి విరాళం అందించారు.
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తొలి విరాళం..
దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయోధ్య రామ మందిర నిర్మాణానికి రూ. 5,01,000 విరాళంగా అందజేసినట్లు విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) అలోక్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విరాళాల సేకరణ జరుగుతున్న విషయం తెలిసిందే.
సూరత్ వ్యాపారి భారీ విరాళం..
ఇది ఇలావుండగా, గుజరాత్లోని సూరత్కు చెందిన ఓ డైమండ్ ట్రేడర్ ఆయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భారీ విరాళం అందజేసింది. వీహెచ్పీ కార్యాలయంలో డైమండ్ ట్రేడర్ గోవింద్ భాయి ఢోలాకియా రూ. 11 కోట్ల విరాళం అందజేశారు. శుక్రవారం నుంచి వీహెచ్పీ, రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్) శుక్రవారం నుంచే రామ మందిర నిర్మాణానికి విరాళాలు సేకరిస్తున్నారు. గోవింద్ భాయి ఢోలాకియా ఓ వజ్రాల వ్యాపారి. రామకృష్ణ డైమండ్ యజమాని అయిన ఢోలాకియా గత ఏడాది కాలంగా ఆర్ఎస్ఎస్తో కలిసి పనిచేస్తున్నారు. 1992లో కూడా ఢోలాకియా సహకరించారు. శుక్రవారం రామ మందిర నిర్మాణం కోసం రూ. 11 కోట్ల విరాళం అందజేశారు.
గుజరాత్ వ్యాపారుల భారీ విరాళాలు..
కాగా, గుజరాత్ నుంచి మరికొందరు వ్యాపారస్తులు కూడా భారీగానే విరాళాలందించారు. సూరత్ వ్యాపారి మహేశ్ కబూటర్వాలా రూ. 5 కోట్లు, లవ్జీ బాద్ షా కోటి రూపాయలను రామ మందిర నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. అంతేగాక, గుజరాత్ రాష్ట్రానికి చెందిన పలువురు వ్యాపారులు రూ. 5 లక్షల నుంచి రూ. 21 లక్షల వరకు విరాళంగా అందజేశారు. భారతీయ జనతా పార్టీ గోర్దన్ జడఫియా, ట్రేజరర్ సురేంద్ర పటేల్ ఇటీవల రూ. 5 లక్షల విరాళం ఇచ్చారు.