కరోనా పోవాలని నరబలి ... కలలో దేవుడు చెప్పాడని ఓ పూజారి ఘాతుకం
కరోనాను అరికట్టటం కోసం ఒక పూజారి చేసిన నరబలి ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ గా మారింది. కరోనాతో పాటు పెరుగుతున్న మూఢ నమ్మకాలకు ఈ ఘటన సాక్ష్యంగా నిలిచింది. ఒకపక్క కరోనా ఎలా పెరుగుతుందో మరోపక్క మూఢ నమ్మకాలు కూడా అంతే రేంజ్ లో పెరుగుతున్నాయని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
పెరుగుతున్న మూఢ నమ్మకాలు ... కరోనా రాదని చిత్తూరు జిల్లాలో సామూహిక పూజలు
నరబలి ఇస్తే కరోనా తగ్గుతుందని ఆలయంలో నరబలి ఇచ్చిన పూజారి
కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి. ఇక ఈ మహమ్మారి బారినుండి కాపాడుకోవడానికి సామాజిక దూరం పాటించటం, మాస్కులు ధరించడం, ఇతరులను తాకకుండా ఉండటం, తగు జాగ్రత్తలు పాటించడం అవసరమని ప్రభుత్వాలు చెప్తున్నా కరోనా విషయంలో మాత్రం ప్రజల మూఢనమ్మకాలు పోవడం లేదు. వేప చెట్టుకు నీళ్లు పోస్తే కరోనా తగ్గుతుందని, గ్రామ దేవతలకు పూజలు చేస్తే కరోనా తగ్గుతుందని,గ్రామస్తులంతా ఊరిబయట ఒక రోజంతా గడిపితే కరోనా తగ్గుతుందని రకరకాల మూఢనమ్మకాలతో వివిధ ప్రాంతాలను ప్రజలు చేసిన పనులు తెలిసినవే. అయితే తాజాగా నరబలి ఇస్తే కరోనా తగ్గుతుందని ఏకంగా ఒక వ్యక్తి ప్రాణమే తీశాడు పూజారి.
ఒడిశా లో దారుణ ఘటన .. నరబలి ఇచ్చి పోలీసులకు లొంగిపోయిన పూజారి
ఒడిశాలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళితే కటక్ లో ఒక వృద్ధ పూజారి దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి, కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టటానికి ఒక వ్యక్తిని నరబలి ఇచ్చాడు. దేవాలయానికి భగవంతుని దర్శనం చేసుకోవడానికి వచ్చిన ఒక వ్యక్తి తలను దేవాలయ ప్రాంగణంలోనే నరికేశాడు.ఈ సంఘటన కటక్ జిల్లా లోని నర్సింగ్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల బంధహూడ సమీపంలోని ఆలయంలో జరిగింది. సంసారి ఓజా అనే 72 ఏళ్ల పూజారి ఈ నేరానికి పాల్పడి పోలీసుల ముందు లొంగిపోయారు. ఇక మృతుడిని 52 సంవత్సరాల వయసుగల సతీష్ కుమార్ ప్రధాన గా గుర్తించారు.
కలలో కనిపించి దేవుడు అలా చెయ్యమని చెప్పాడన్న నిందితుడు
నరబలి ఇస్తే కరోనా వైరస్ తగ్గుతుందని ఆలయంలో పూజారికి,సరోజ్ కుమార్ ప్రాధాన్ కు మధ్య వాగ్వాదం జరిగిందని నిందితుడి తెలిపారు. వాదన తీవ్రం కావడంతో ఓజా అతనిని పదునైన గొడ్డలితో హతమార్చాడు.తలకు బలమైన దెబ్బ తగలడంతో అతను అక్కడికక్కడే మరణించారు. అయితే తనకు కలలో దేవుడు కనిపించి, కరోనా తగ్గాలి అంటే నరబలి ఇవ్వాలి అని ఆదేశాలు ఇచ్చారని అందుకే ఈ ఘాతుకానికి పాల్పడ్డానని, నరబలి కరోనాను తప్పక తొలగిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇక హత్యకు ఉపయోగించిన గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మృతుడికి , పూజారికి మధ్య భూ వివాదాలున్నాయన్న స్థానికులు
అయితే గ్రామస్తులు మాత్రం వీరిద్దరి మధ్య భూ సంబంధిత వివాదాలు ఉన్నాయని, గ్రామానికి శివారులో ఉన్న మామిడి తోట విషయంలో ఇద్దరికీ మధ్య చాలా కాలంగా ఘర్షణ జరుగుతుందని ,అందుకే హత్య చేసి ఉంటాడని అంటున్నారు. ఇక ఈ సంఘటనపై పోలీస్ డిఐజి సెంట్రల్ రేంజ్ ఆశిష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ సంఘటన జరిగిన సమయంలో పూజారి ఎక్కువగా మద్యం సేవించి ఉన్నట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలిందని,మరుసటి రోజు ఉదయం తిరిగి పూజారి స్పృహలోకి వచ్చిన తర్వాత పోలీసులకు లొంగిపోయారు అని నేరాన్ని అంగీకరించాడని పేర్కొన్నారు. ఇక పూజారి మానసిక పరిస్థితి కూడా సరిగాలేదని పోలీసులు తమ దర్యాప్తు ద్వారా నిర్ధారణకు వచ్చారు.
Recommended Video
మూఢ నమ్మకాలతో అనాగరిక చర్యలు .. ఆపకుంటే కష్టమే
ఇక ఈ ఘటన నేపథ్యంలో స్థానికంగా ప్రజలు భయ బ్రాంతులకు గురవుతున్నారు. 21వ శతాబ్దంలో కూడా ప్రజలు ఇలాంటి అనాగరికమైన మూఢనమ్మకాలతో ప్రవర్తిస్తున్నారని తాజా పరిణామాల నేపథ్యంలో అర్థమవుతుంది. కరోనా వైరస్ తీవ్రంగా ప్రబలుతున్న వేళ పెరుగుతున్న మూఢనమ్మకాలను అరికట్టకుంటే ఇలాంటి దారుణాలు చూడాల్సి వస్తుందని సామాజిక కార్యకర్తలు అంటున్నారు.