బాలికపై అత్యాచారం, హత్య: పూజారికి 23 ఏళ్ల జైలు శిక్ష
వేలూరు: అతను దేవాలయంలో పూజలు చేసి అందరి కష్టాలు తీరాలని ఆ దేవుడిని వేడుకునే పవిత్రమైన పని చేస్తున్నాడు. అయితే కామంతో కళ్లు మూసుకుని చిన్నారి పట్ల కాలయముడైనాడు. అణ్యం పుణ్యం తెలియని బాలికకు చాక్లెట్ ఆశ చూపించి తీసుకు వెళ్లి బాలికపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేశాడు.
ఆంధ్రప్రదేశ్-తమిళనాడు సరిహద్దులోని వేలూరు జిల్లా గుడియాతంలోని పాండియన్ నగర్ లోని వినాయకుడి గుడి వీధిలో నివాసం ఉంటున్న కుమార్ (50) అనే కామాంధుడికి న్యాయస్థానం 23 సంవత్సరాల కఠిన కారాగారశిక్ష విధించింది.
కుమార్ అదే ప్రాంతంలోని దేవాలయంలో పూజారిగా పని చేస్తున్నాడు. స్థానికులు అందరూ అతనికి పరిచయం ఉన్నారు. ఆలయ పూజారి అని అందరు గౌరవించేవారు. కుమార్ నివాసం ఉంటున్న ప్రాంతంలో రాజు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి రాజేశ్వరి ( 6) అనే కుమార్తె ఉంది. రాజేశ్వరి అదే ప్రాంతంలోని స్కూల్ లో 2వ తరగతి చదివేది.
2011 సెప్టెంబర్ 19వ తేదిన స్కూల్ నుండి రాజేశ్వరి ఇంటికి బయలుదేరింది. తరువాత బాలిక ఆచూకీ లేదు. పరిసర ప్రాంతాలు, బంధువుల ఇండ్లలో గాలించారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రాజేశ్వరి కోసం గాలించారు.
మూడు రోజుల తరువాత రాజు ఇంటి సమీపంలోని వ్యవసాయ బావిలో రాజేశ్వరి శవమై కనిపించింది. పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పూజారి కుమార్ అనుమానాస్పదంగా తిరుగుతున్న విషయం గుర్తించిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.
తరువాత కామాంధుడు చేసిన పని తెలుసుకుని పోలీసులు హడలిపోయారు. చాక్లెట్ తీసేస్తానని చెప్పి రాజేశ్వరిని తీసుకు వెళ్లి అత్యాచారం చేశానని, ఇంటిలో విషయం చెబుతుందని భయంతో గొంతు నులిమి హత్య చేసి బావిలో విసిరి వేశానని కుమార్ అంగీకరించాడు. పోలీసులు న్యాయస్థానంలో నివేదిక సమర్పించారు.
వేలూరు మహిళ కోర్టులో కేసు విచారణ జరిగింది. కేసు విచారణ చేసిన న్యాయమూర్తి నజీర్ అహమ్మద్ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. కుమార్ రాజేశ్వరిని కిడ్నాప్ చేసి హత్య చేశాడని సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినందుకు 10 సంవత్సరాలు, హత్య చేసినందుకు 10 సంవత్సరాలు, సాక్ష్యాలు నాశనం చేసినందుకు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు.
మొత్తం 23 సంవత్సరాల జైలు శిక్ష విదించారు. పోలీసులు నిందితుడు కుమార్ ను వేలూరు సెంట్రల్ జైలుకు తరలించారు. తమకు న్యాయం జరిగిందని రాజేశ్వరి కుటుంబ సభ్యలు తెలిపారు.