రామమందిర నిర్మాణంపై స్పష్టత ఇవ్వని యోగీ...డిసెంబర్ 6న ఏమి జరగబోతోంది..?
Recommended Video
మరి కొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో మళ్లీ రాజకీయాలు అయోధ్య చుట్టూ తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అయోధ్యలో పర్యటించడం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఫైజాబాద్ను త్వరలో అయోధ్యగా పేరు మారుస్తామని తన ప్రసంగంలో చెప్పి యోగీ ఆదిత్యనాథ్ దివాళీ కానుక ఇచ్చారు. అయోద్య దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తుందని ఆదిత్యనాథ్ చెప్పారు. శ్రీరాముడిపై ఎంతో నమ్మకముందని చెప్పిన యోగీ... అంతా మంచే జరుగుతుందన్నారు.
రామమందిర నిర్మాణం పై లేని స్పష్టత
అయోద్య భారత దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తుందని యోగీ చెప్పారు. అయోధ్య గౌరవానికి చిహ్నం అని చెప్పిన సీఎం... అయోద్యకు ఎవరూ అన్యాయం చేయలేరని వెల్లడించారు. ఇక రాముడి విగ్రహం పై యోగీ ఓ ప్రకటన చేస్తారని చాలామంది భావించినప్పటికీ ఎలాంటి ప్రకటన చేయకుండా కాస్త నిరాశపరిచారు. ఇక రామమందిర నిర్మాణం పై కూడా యోగీ సరైన స్పష్టత ఇవ్వలేదు. అలహాబాద్ పేరును ప్రయాగ్రాజ్గా మారుస్తామని ఇదివరకే ప్రకటించిన యోగీ.... లక్నోలోని అంతర్జాతీయ క్రికెట్ మైదానం పేరును అటల్ బిహారీ వాజ్పేయి మైదానంగా మార్చారు. అయితే యోగీ నిర్ణయంపై విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.
యోగీ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న అర్చకులు
ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్య మారుస్తామన్న యోగీ ప్రకటనను స్వాగతిస్తున్నట్లు చెప్పారు అయోధ్య ఆలయంప్రధాన అర్చకుడు మహంత్ సత్యేంద్రదాస్. అయితే రామమందిర నిర్మాణం చేస్తామని ప్రకటించకపోవడం నిరాశ కలిగించిందని చెప్పారు. పార్లమెంట్లో అయోధ్యలో రామమందిర నిర్మాణంపై చట్టం తీసుకొస్తారని ఆశిస్తున్నట్లు సత్యేంద్ర దాస్ తెలిపారు. కేంద్రం కూడా ఇందుకోసం చర్యలు తీసుకుని అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 6 లోగా కేంద్రం లేదా యూపీ ప్రభుత్వం నుంచి అయోధ్య రామమందిర నిర్మాణంపై స్పష్టమైన ప్రకటన చేయకుంటే తనే అగ్గికి ఆహుతై త్యాగం చేస్తానని హెచ్చరించారు మహంత్ పరమహన్స్. అయోధ్యకు మెడికల్ కాలేజీ, విమానాశ్రయం వస్తుండటం శుభపరిణామమే అయినప్పటికీ రామమందిరం నిర్మాణంపై ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు అఖిల భారతీయ సంత్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహంత్ గౌరీ శంకర్.
దక్షిణ కొరియా ప్రథమ మహిళా పౌరురాలుకు అయోధ్యతో సంబంధం
ఇదిలా ఉంటే అయోధ్యలో దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో ప్రత్యేక అతిథిగా దక్షిణ కొరియా ఫస్ట్ లేడీ కిమ్ జుంగ్ సూక్ పాల్ పాల్గొన్నారు. ఆమెతో పాటు ఆ దేశ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఇక సూక్ రాణిసూరిరత్న స్మారకంను సందర్శించుకోవడం ద్వారా తన అధికారిక పర్యటనను ప్రారంభించారు. కొరియా రాణికి అయోధ్యతో సంబంధం ఉన్నట్లు సమాచారం. అందుకే ఆమె అయోధ్యకు వచ్చినట్లు తెలుస్తోంది. 2వేల సంవత్సరాల క్రితం రాణి సూరిరత్న దక్షిణ కొరియాకు వెళ్లి అక్కడి రాజు కిమ్ సురోను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె పేరును హియో హ్వాంగ్ రాణిగా మార్చుకున్నారు. ఈ క్రమంలోనే ప్రథమ మహిళా పౌరురాలు దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.