రాఫెల్ డీల్: ఒకరికోసం మోడీ దేశభద్రతను తాకట్టు పెట్టారన్న బీజేపీ మాజీ కేంద్ర మంత్రులు
వివాదాస్పదంగా మారిన రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం రక్షణ నిబంధనలను ఉల్లంఘించిందంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ కేంద్ర మంత్రులు అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హా. ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత లాభం కోసమే ప్రతి నిబంధనను ఉల్లంఘించి దేశ రక్షణ వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టారని మండిపడ్డారు. 126 యుద్ధ విమానాలు కొనుగోలు చేయాల్సి ఉండగా ప్రధాని తన వ్యక్తిగత లాభం కోసం దేశ రక్షణ వ్యవస్థను తాకట్టు పెట్టారని మండి పడ్డ వారు ప్రస్తుతం విమానాల కొనుగోలు సంఖ్యను 36కు తీసుకొచ్చారని ఆరోపించారు.
భారీ స్థాయిలో యుద్ధవిమానాల కొనుగోలు చేయాల్సి ఉండగా ఆగమేఘాలపై కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ప్రధాని నరేంద్ర మోడీ కథను మొత్తం మార్చేశారని అరుణ్ శౌరి మండిపడ్డారు. ఇలా చేసేందుకు ప్రధానికి ఎలాంటి అధికారంకానీ, హక్కుకానీ లేదన్నారు. ప్రధాని నేరాన్ని కప్పిపుచ్చేందుకు కేబినెట్ మంత్రులు రంగంలోకి దిగి ఆయన్ను కాపాడేందుకు వరస అబద్ధాలు కథలు కథలుగా చెబుతున్నారని ఆరోపించారు.
రాఫెల్ డీల్ కంటే ముందు రిలయన్స్ డిఫెన్స్తో ఒప్పందానికి నో చెప్పిన రష్యా
ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఉన్నతాధికారులు కూడా ప్రధాని మోడీని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని సామాజికవేత్త సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు. అది వారు సొంతంగా చేస్తున్న ప్రయత్నం కాదని... ప్రభుత్వంలోని మంత్రులు వారిని ఆ విధంగా మాట్లాడేలా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. యుద్ధ విమానాల కొనుగోలులో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పాలని మంత్రులు అధికారులపై రుద్దుతున్నారని ప్రశాంత్ భూషణ్ ఫైర్ అయ్యారు.
అసలు యుద్ధవిమానాల తయారీలో ఎలాంటి అనుభవం లేని అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్కు బాధ్యతలు ఎలా అప్పగిస్తారని యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, ప్రశాంత్ భూషణ్లు ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ను కాదని రిలయన్స్ డిఫెన్స్ సంస్థను ఎలా ఎంచుకుంటారని మండిపడ్డారు. 2012లో ఆనాటి యూపీఏ ప్రభుత్వం హయాంలో ఫ్రాన్స్ నుంచి 18 జెట్ విమానాలు కొనుగోలు చేయాలని భావించింది. మిగతా 108 విమానాలను హిందుస్తాన్ ఏరోనాటిక్స్ సంస్థలో అసెంబ్లింగ్ చేయాలని భావించింది. 2015లో బీజేపీ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ ఎగిరేందుకు సిద్ధంగా ఉన్న 36 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఫ్రాన్స్ దసాల్ట్ ఏవియేషన్ నుంచి టెక్నాలజీని ఇక్కడకు బదిలీ చేసుకుని యుద్ధవిమానాలను భారత్లో తయారు చేయడానికి మోడీ సర్కార్ నో చెప్పింది.