మాతృభాషలోనే ప్రాథమిక విద్య: 5వ తరగతి వరకు: ఆప్షనల్గా ఇంగ్లీష్: మార్కులిస్ట్కు బదులుగా
న్యూఢిల్లీ: విద్యార్థిలోని ప్రతిభను గుర్తించడానికి మార్కులను ఆలంబనగా తీసుకోవడం ఎంత మాత్రమూ సరి కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మార్కుల జాబితాకు బదులుగా సమగ్ర మూల్యాంకన జాబితా (హోలిస్టిక్ షీట్)ను ప్రాతిపదికగా తీసుకోబోతున్నామని చెప్పారు. ఒక విద్యార్థి చదువుతో పాటు ఇతర కార్యకలాపాలను కూడా ప్రాతిపదికగా తీసుకుంటామని అన్నారు. దీనికోసం ప్రత్యేకంగా మూల్యాంకన కేంద్రాన్ని నెలకొల్పుతామని తెలిపారు. మార్కులను ప్రాతిపదికగా తీసుకుని విద్యార్థి ప్రతిభను వెలికి తీయాలనుకోవడం సహేతుకం కాదని చెప్పారు. మార్కుల జాబితా అనేది తల్లిదండ్రులకు ప్రతిష్ఠాత్మకంగా.. విద్యార్థులకు ఒత్తిడికి గురి చేసేదిగా భావిస్తున్నామని తేల్చి చెప్పారు.
Recommended Video
ప్రాంతీయ భాషలోనే బోధన..
పాఠ్యాంశాల బోధన ప్రాంతీయ భాషల్లోనే జరగాలని కోరుకుంటున్నామని అన్నారు. భాషను అర్థం చేసుకోవడంలోనే విద్యార్థి ప్రతిభ బహిరంగమౌతుందని అన్నారు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే జపాన్, దక్షిణ కొరియా, పోలెండ్, ఐర్లాండ్, ఈస్టోనియా వంటి అనేక దేశాల్లో ప్రాథమిక విద్య మాతృభాషలోనే కొనసాగుతోందని చెప్పారు. మాతృభాషలో విద్యను కొనసాగించలేకపోతే.. ఇబ్బందులు పడతారని అన్నారు. భాషను అర్థం చేసుకోవడం పిల్లల మనస్సులకు ఒత్తిడికి గురి చేస్తుందని చెప్పారు. మాతృభాషపై పట్టు సాధించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఇంగ్లీష్తో పాటు విదేశీ బాషలకూ ప్రోత్సాహం..
మాతృభాషతో పాటు ఇంగ్లీష్, విదేశీ బాషల బోధనపై ప్రతిబంధకాలు లేవని తెలిపారు. విద్యార్థులపై ఒత్తిడి పడనివ్వకుండా.. వారికి ఒతిళ్లకు గురి కానివ్వకుండా బోధన కొనసాగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇంగ్లీష్లో పాఠాలను విన్న తరువాత.. పిల్లలు ప్రాంతీయ భాషలోకి తమను తాము తర్జుమా చేసుకోవాల్సి వస్తుందని, ఇది వారిని మరింత ఒత్తిడికి గురి చేస్తుందని అన్నారు. అలాంటి ఒత్తిడి పూరక వాతావరణాన్ని నివారించడానికి ప్రాథమిక విద్యను మాతృభాషలోనే కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయిదో తరగతి వరకూ మాతృభాషలోనే విద్యను అందించడం తప్పనిసరి చేశామని వెల్లడించారు.
విద్యార్థులు ఏ భాషలో త్వరగా అర్థం చేసుకోగలిగితే..
ప్రాథమిక తరగతుల విద్యార్థులు ఏ భాషలో పాఠ్యాంశాలను త్వరగా.. ఒత్తిడికి లోను కాకుండా అర్థం చేసుకోగలుగుతారో.. అదే భాషలో పాఠ్యాంశాల బోధనను కొనసాగించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి తెలిపారు. ఉపాధ్యాయులు బోధిస్తున్నపాఠ్యాంశాలను పిల్లలు అర్థం చేసుకోగలుగుతున్నారా? లేదా? అనేది ప్రధానాంశమని అన్నారు. మాతృభాషలో విద్యాబోధన కొనసాగించకపోతే పిల్లల శక్తిసామర్థ్యాలు పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడంలోనే వృధా అవుతుందని అన్నారు. అందుకే ప్రాథమిక విద్యాభ్యాసాన్ని అయిదో తరగతి వరకు తప్పనిసరి చేశామని చెప్పారు.
ఇంగ్లీష్తో పాటు విదేశీ భాషలకూ
విద్యార్థులు ఇంగ్లీష్తో పాటు విదేశీ భాషలనూ నేర్చుకోవడానికి వీలు కల్పిస్తామని తెలిపారు. మాతృభాషలోనే విద్యాబోధనను కొనసాగించడంపై ప్రతిబంధకాలు ఏవీ లేవనీ ప్రధాని అన్నారు. ఇంగ్లీష్తో పాటు ఇతర విదేశీ భాషలను నేర్చుకోవడానికి అవకాశం కల్పించామని తెలిపారు. విదేశీ బాషలపైనా పట్టు సాధించాల్సిన అవసరం ఉందని ప్రధాని తేల్చి చెప్పారు. అన్ని ప్రాంతీయ, స్థానిక భాషలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని, దీనికోసం ప్రాథమిక విద్యను మాతృభాషలోనే కొనసాగించడానికి తాము ప్రాధాన్యతను ఇస్తున్నామని అన్నారు. ఇదే అంశాన్ని జాతీయ నూతన విద్యావిధానంలో పొందుపరిచామని తెలిపారు.