ఉత్తర కర్ణాటక శునకాల నుంచి దేశభక్తి నేర్చుకోండి: సోనియా, రాహుల్ మీద కేసులు: మోడీ ఫైర్!
బెంగళూరు: పెద్దల నుంచి నేర్చుకోకపోయినా కనీసం దేశ సైన్యానికి సేవలందిస్తున్న ఉత్తర కర్ణాటకలోని ముధోల్ జాతి శునకాల నుంచి కాంగ్రెస్ నేతలు దేశభక్తిని నేర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యాలు చేశారు. దేశభక్తి అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు గిట్టదని, దేశభక్తి గురించి చర్చ జరిగితే చాల మందికి ఇబ్బంది కలుగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ఎద్దేవ చేశారు.
దేశభక్తితో స్వాతంత్రం
దేశభక్తితో మనం స్వాతంత్య్రం సాధించుకున్నామని,. అదే దేశభక్తి కోపం బీజేపీ ప్రచారం మొదలుపెడితే కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా ఇబ్బంది పడిపోతారని, దేశభక్తి మాట ఎత్తితే ఆ పార్టీ నేతలు అనారోగ్యాని గురౌతారని ప్రధాని నరేంద్ర మోడీ వ్యంగ్యంగా అన్నారు.
సర్వనాశనం అయిపోతారు.
దేశాన్ని ముక్కలు చేస్తామని చెప్పినవారికి వత్తాసు పలికేస్థాయికి కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయిందని, సైన్యం చేసిన మెరుపుదాడులకూ ఆధారాలు అడిగే స్థాయికి ఆ పార్టీ పతనమైపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రజలు ఛీకొట్టినా కాంగ్రెస్ పార్టీ నేతలకు ఏమాత్రం అహంకారం ఏమాత్రం తగ్గలేదని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు.
ముధోల్ శునకాలు
ఉత్తర కర్ణాటకలోని ముధోల్ శునకాలు సైన్యంలో సేవలు అందిస్తున్నాయని, ఆ శునకాల నుంచి వారు దేశభక్తిని నేర్చుకుంటారనే ఆశ తనకు ఏమాత్రం లేదని ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో చాలా వరకు కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయిందని, కర్ణాటకలో అదే జరుగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
వారం రోజులు అధికారం
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటు వేస్తారా అని ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు హాజరైన ప్రజలు ప్రశ్నించారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమికొడతామని కార్యకర్తలు సమాధానం ఇవ్వడంతో ప్రధాని నరేంద్ర మోడీ ఆనందం వ్యక్తం చేశారు. సీఎం సిద్దరామయ్య రెండు నియోజక వర్గాల్లో ఓడిపోతారని, వారం రోజులు మాత్రమే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ జోస్యం చెప్పారు.
తల్లీ, కొడుకుల మీద కేసులు
కర్ణాటక బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్. యడ్యూరప్ప మీద అనవసరంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తల్లీ, కుమారుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు మాట్లాడరని, ఏం సమాధానం చెబుతారని ప్రధాని నరేంద్ర మోడీ ఆ పార్టీ నాయకులను ప్రశ్నించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా బెయిల్ మీద బయట ఉన్నారని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేశారు.