ఈ ఏడాది చిట్టచివరిసారిగా నరేంద్ర మోడీ ఆ స్పీచ్: ఏబీసీ ఛార్ట్: విశాఖవాసి పేరు ప్రస్తావన
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఏడాది ఇదే ఆయన చిట్టచివరి ప్రసంగం. విశాఖపట్నానికి చెందిన వెంకట మురళి గురించి నరేంద్ర మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఆయన రూపొందించిన ఏబీసీ ఛార్ట్ గురించి వివరించారు. ఆత్మనిర్భర్ భారత్ ఛార్ట్ (ఏబీసీ)లో అనేక విషయాలను వెంకట మురళి పొందుపరిచినట్లు నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
ఆత్మనిర్భర్ భారత్, లోకల్ ఫర్ వోకల్, స్టార్టప్ల రంగం గురించిన అనేక విషయాలను వెంకట్.. తన ఏబీసీ ఛార్ట్లో వివరించారని మోడీ తెలిపారు. ప్రతి దేశ పౌరుడు కూడా ఆత్మనిర్భర్ భారత్ సహా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు, విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోన్న వస్తువులకు ప్రత్యామ్నాయంగా రూపొందించాల్సిన అంశాలపై ఓ ఛార్ట్ను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని నరేంద్ర మోడీ అన్నారు. కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి ఛార్ట్ చేస్తారని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
విదేశీ వస్తువల దిగుమతిని నియంత్రించడంతో పాటు దేశీయంగా అలాంటి వాటికి ప్రత్యామ్నాయాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. సిక్కుల మత గురువు గురు గోవింద్ సింగ్, ఆయన కుమారుడు సాహెబ్జాదె త్యాగాల గురించి మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. తాను కొద్దిరోజుల కిందటే దేశ రాజధానిలోని గురుద్వారాను సందర్శించానని గుర్తు చేశారు. సిక్కుల త్యాగనిరతి అత్యంత గొప్పదని పేర్కొన్నారు. దేశంలో చిరుతల సంఖ్య భారీగా పెరిగిందని నరేంద్ర మోడీ చెప్పారు.