వీటిపైనా కొన్ని తీయండి: సినీ తారలకు మోడీ పిలుపు
చెన్నై: సినీ తారలు, యువత చేనేత ఉత్పత్తులు వాడాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. చేనేత వస్త్రాలను వాడటం ద్వారా ఈ రంగానికి ప్రాచుర్యం కల్పించాలని కోరారు. శుక్రవారం చెన్నైలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవంలో మోడీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమాల కారణంగా దేశంలో అనేక పర్యాటక ప్రాంతాలు వెలుగులోకి వచ్చాయని, చేనేత నేపథ్యంలో కొన్ని సినిమాలు రావాలని అన్నారు. ఇలాంటి చిత్రాల ద్వారా నేత కార్మికుల జీవితాలు బాగుపడతాయని చెప్పారు.
చేనేత అంశంతో సినిమాలు తీయడం, చేనేత ఉత్పత్తులు ఉపయోగించడం ద్వారా ఆ రంగానికి మేలుచేసిన వారవుతారని ఫిలీం మేకర్లను ఉద్దేశించి అన్నారు. పబ్లిసిటీ లోపించిన కారణంగానే చేనేత పరిశ్రమ అనాదరణకు గురైందని ఆయన అభిప్రాయపడ్డారు. చేనేత రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
'సినిమా నటులు తమ ప్రతి ఐదు సినిమాల్లో ఒక చిత్రంలో చేనేత, చేతి ఉత్పత్తులు వాడితే.. ఈ సినిమాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తాయి. ఫ్యాషన్ కు ప్రాచుర్యం కల్పించడంలో సినీ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుంది' అని అన్నారు.
ప్రస్తుతం యువత ఎక్కువగా ఆన్ లైన్ ద్వారా షాపింగ్ చేస్తున్నారని, చేనేత వస్త్రాలను కూడా ఆన్లైన్అందుబాటులో ఉంచాలని సూచించారు. మార్కెట్లో చేనేత ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరముందని మోడీ అన్నారు.
చెన్నైకు వచ్చిన మోడీకి విమానాశ్రయంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత స్వాగతం పలికారు. జయ ఆహ్వానం మేరకు మోడీ ఆమె నివాసానికి విందుకు వెళ్లారు.