అవినీతిపై యుద్ధం ఆగదు: తేల్చేసిన మోడీ, కొత్త ఏడాది వరాలు
న్యూఢిల్లీ: నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన ప్రధాని నరేంద్ర మోడీ.. కొత్త సంవత్సరంలో దేశ ప్రజలు నూతనోత్తేజంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పెద్ద నోట్ల రద్దు గడవు ముగిసిన తర్వాత ఆయన శనివారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజల సహకారంతో ప్రక్షాళన యజ్ఞం సాగిందని అన్నారు.
దీపావళి తర్వాత పెద్ద నోట్లను రద్దు చేస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్నామని, ఈ నిర్ణయంతో భవిష్యత్ ఫలాలు బాగుంటాయని చెప్పారు. నల్లధనంపై యుద్ధంలో నిజాయితీపరులు కూడా ఇబ్బందులు పడ్డారు. దేశ ప్రయోజనం కోసం ప్రజలు ఇబ్బందులను కూడా ఎదుర్కొంటామని నిరూపించారు. ప్రజల త్యాగం వారికి భవిష్యత్లో గొప్ప ఫలితాలను ఇస్తుందన్నారు. ప్రభుత్వం, ప్రజలు భుజం భుజం కలిపి అవినీతిపై పోరాటం సాగించారన్నారు.
ప్రజలు అవినీతి రహిత సమాజాన్ని కోరుకుంటున్నారని అన్నారు. అన్ని వర్గాల్లో దేశ భక్తి పెరిగిందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థను బ్లాక్ మార్కెట్ చిన్నాభిన్నం చేసిందన్నారు. ఈ ప్రభుత్వం మంచివారికి అండగా ఉంటుంది, చెడ్డవారిని సన్మార్గంలో నడిపించేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థను సక్రమ మార్గంలోకి తీసుకొస్తామని చెప్పారు.
ఉగ్రవాదులు, తీవ్రవాదులు, డ్రగ్స్ మాఫియా నల్లధనంపైనే ఆధారపడ్డారు. నోట్ల రద్దుతో వారందరికి చెక్ పెట్టామని అన్నారు. చెడును ఓడించడానికి పోరాటం జరుగుతోందని అన్నారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ ఈ ప్రభుత్వ నినాదమని చెప్పారు. అవినీతిపై యుద్ధం చేస్తున్న ప్రభుత్వానికి దేశ ప్రజలు అండగా నిలుస్తున్నారని, అవినీతిని పూర్తిగా నిర్మూలించాలని కోరుతున్నారని అన్నారు.
నల్లధనంపై పోరులో ప్రజలు వెనకడుగు వేయొద్దంటున్నారని తెలిపారు. ఇంతకాలం బ్యాంకుల్లోకి రాని నల్లధనం ఇప్పుడు వచ్చిందన్నారు. బ్యాంకులు, పోస్టాఫీసుల సిబ్బంది నోట్ల రద్దు తర్వాత నిరాంతరాయంగా పని చేశారని అన్నారు. కొత్త ఏడాదిలో బ్యాంకులు మరింత సరళంగా వ్యవహరిస్తాయని అన్నారు.
బ్యాంకులు పేద ప్రజలకు అనుకూలమైన పథకాలని ప్రవేశపెట్టాలని కోరారు. గరీబ్ కళ్యాణ్ పథకం ద్వారా బ్యాంకులు పేద ప్రజల కోసం పని చేయాల్సి ఉంటుందని అన్నారు. ప్రధాని ఆవాస్ యోజన క్రింద పేద ప్రజలకు పెద్ద ఎత్తున గృహాలను నిర్మిస్తున్నామని చెప్పారు. గృహాలకు ఇచ్చే రుణాలపై రాయితీలను కల్పిస్తున్నామని చెప్పారు.
పేదలతోపాటు మధ్య తరగతి ప్రజలు కూడా సొంత ఆవాసాలకు నోచుకోవడం లేదని అన్నారు. వారి కోసం రూ. 9లక్షల వరకు గృహ రుణాలపై 4శాతం వడ్డీ రాయితీ, రూ. 12లక్షల వరకు గృహ రుణాలపై 3శాతం వడ్డీ రాయితీని ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు.
ముద్ర యోజక కింద యువతకు రుణాలు ఇచ్చి వారికి ఉపాధినందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 3కోట్ల మంది ఈ పథకంతో లబ్ధి పొందారని అన్నారు. గర్భవతి మహిళల కోసం ఒక ప్రత్యేకమైన పథకాన్ని ప్రవేశపెడుతున్నామని తెలిపారు. గర్భవతి మహిళల వైద్యం, పౌష్టికాహారం అందించేందుకు ప్రతీ మహిళ ఖాతాలో రూ.6వేలను జమ చేస్తున్నట్లు తెలిపారు.
సీనియర్ సిటిజన్లు కూడా దేశంలో ఎక్కువగా ఉన్నారు. వారి కోసం ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రారంభించబోతోంది. సీనియర్ సిటిజన్లకు కొంత మొత్తం వరకు పన్ను మినహాయింపుతోపాటు బ్యాంకుల్లోని మొత్తాలకు వడ్డీ రేటును కొంత ఎక్కువగా అందించనున్నట్లు తెలిపారు.
రాబోయే 3 నెలల్లో కిసాన్ క్రిడిట్ కార్డులను రూపే కార్డుగా మారుస్తామని చెప్పారు. బ్యాంకింగ్ సేవలను కూడా గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సహకార బ్యాంకుల్లో రైతులు తీసుకున్న మొత్తాలకు రెండు నెలల వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు.
అవినీతిపై యుద్ధం ఆగబోదని మరోసారి ప్రధాని మోడీ స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు ఫలితాలు త్వరలోనే చూస్తారని అన్నారు. అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని అన్నారు. శాసనసభ, లోకసభ ఎన్నికలు ఒకేసారి జరిగితే ఎంతో ప్రయోజనం ఉంటుందని చెప్పారు.