మంచివారే రాజకీయాల్లోకి రావాలి: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ఉత్తములు, మంచివారే రాజకీయాల్లోకి రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. రాజకీయాలంటే భయపడాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయాలపై చెడు ముద్ర పడడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మోడీ విద్యార్థులను ఉత్తేజపరిచేందుకు శుక్రవారం చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
వివిధ రంగాల నుంచి సజ్జనులు, తెలివిగలవారు, ప్రతిభావంతులు రాజకీయాల్లోకి రావడం ముఖ్యమని, ఎంత మంది మంచివారు రాజకీయాల్లోకి వస్తే దేశానికి అంత మంచిదని ప్రధాని చెప్పారు. ఢిల్లీలోని మానెక్షా ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో వివిధ పాఠశాలల నుంచి 800 మంది విద్యార్థులు, 60 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మరో 9 రాష్ట్రాల విద్యార్థులు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. 105 నిమిషాల పాటు జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన వివిధ ప్రశ్నలకు మోడీ సమాధానాలిచ్చారు. లక్ష్యసాధనలో వైఫల్యాలు ఎదురయినంత మాత్రాన విద్యార్థులు అంతటితో ఆగిపోరాదని సూచించారు. కెరియర్ ఎంపికకు సంబంధించి తల్లిదండ్రులు తమ సొంత ఇష్టాయిష్టాలను పిల్లలపై రుద్దరాదని కోరారు.
విద్యార్థులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని ప్రోత్సహించారు. విద్యార్థుల జీవితాల్లో కళలు,సంస్కృతికి కూడా ప్రాధాన్యముంటుందన్నారు. విద్య ద్వారా రోబోట్లను తయారు చేయరాదని చెప్పారు. వారు పాఠశాలను వీడి వెళ్లేటప్పుడు కేవలం ప్రవర్తన ధ్రువీకరణ పత్రాలు మాత్రమే ఇవ్వకుండా సమగ్ర వ్యక్తిత్వాన్ని తెలియజేసే విధంగా ప్రతిభా (యాప్టిట్యూడ్) ధ్రువీకరణ పత్రాలను ఇవ్వాలని మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖకు సూచించినట్లు వెల్లడించారు.
విద్యార్థుల ప్రవర్తనపై ప్రతి మూడు నెలలకోసారి సమాచారం సేకరిస్తామన్నారు. వివిధ రంగాల్లోని నిష్ణాతులు విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి వారానికి కనీసం ఒక గంట కేటాయించాలని పిలుపునిచ్చారు. రాజకీయ నేతలు మాత్రం ఈ పని చేయవద్దని, వారు ఇంకేదో చెబుతారని సరదాగా వ్యాఖ్యానించారు.
పరిమిత ఆదాయం ఉన్న కుటుంబంలో పెరిగిన తాను ప్రత్యేకంగా ఏ క్రీడకూ అంకితం కాలేదని చెప్పారు. చెట్లు ఎలా ఎక్కాలో మాత్రం నేర్చుకున్నానన్నారు. ఊరిలో చెరువు వద్దకు దుస్తులు ఉతుక్కోవడానికి వెళ్లినప్పుడు ఈత నేర్చుకున్నానన్నారు. ఇంతటి వాగ్దాటి ఎలా సాధించారని ఒక విద్యార్థి ప్రశ్నించగా మోడీ కొన్ని కిటుకులు చెప్పారు.
‘మంచి వాగ్దాటి రావాలంటే ముందు చక్కగా ఆలకించడం నేర్చుకోవాలి. మాట్లాడేటప్పుడు జనం ఏమనుకుంటారో అని ఆందోళన వద్దు. అధైర్యం వద్దు. ఆత్మవిశ్వాసంతో ఉండాలి. మీరు గూగుల్ గురువు విద్యార్థులు. ఆన్లైన్లో ప్రముఖుల ప్రసంగాలు చూస్తే ఆత్మవిశ్వాసం కలుగుతుంది' అని సూచించారు.
2022లో 75వ స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించుకునే నాటికి దేశ వ్యాప్తంగా 24 గంటల పాటు నిరంతరాయ విద్యుత్తు సరఫరాను తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని చెప్పారు. ‘ఇది నా స్వప్నం. ఈ దిశగా నేను కృషి చేస్తున్నాను' అని తెలిపారు. దేశంలో ఇప్పటికీ 18000 గ్రామాలకు విద్యుత్ సౌకర్యంలేదని చెప్పిన ప్రధాని, ఆ గ్రామాలకు వచ్చే 1000 రోజుల్లోగా విద్యుత్ వెలుగులు పంచాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.