వైభవంగా.. కన్నుల పండువగా: రామ్లల్లాకు సాష్టాంగ ప్రణామం: భూమిపూజలో మోడీ
అయోధ్య: శ్రీరామచంద్రుడి మహాద్బుత ఆలయ నిర్మాణానికి పునాదిరాయి పడింది. శ్రీరాముడి జన్మస్థానంలోనే అపురూపమైన ఆలయం నిర్మితం కాబోతోంది. కోట్లాదిమంది హిందువుల చిరకాల వాంఛ నెరవేరడానికి తొలి అడుగు పడింది.. తొలి ఇటుక పడింది. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, రాములోరి శ్లోకాలు, కీర్తనలు జయజయ ధ్వానాల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామమందిరం నిర్మాణానికి భూమిపూజ చేశారు. తొలి ఇటుకను వేశారు. కన్నుల పండువగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన 175 మంది ప్రతినిధుల సమక్షంలో భూమిపూజ వైభవంగా కొనసాగింది.
మన కాలపు మహాద్భుత ఘట్టం: శతాబ్దాల నాటి కల సాకారం: ముందే వచ్చిన దీపావళి
ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ కంటే కొద్దిగా ముందే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రామజన్మభూమి ప్రదేశంలో నిర్వహించిన భూమిపూజ చేశారు. దేశం నలుమూలల నుంచి రామభక్తులు పంపించిన తొమ్మిది ఇటుకలను ఉంచారు. వాటికి పూజలు చేశారు. ఆయనతో పాటు ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ సహా శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర సభ్యులు అతి కొద్దిమంది మాత్రమే హోమగుండం వద్ద ఆసీనులు అయ్యారు. శ్రీమహావిష్ణువు దశావతారాలను పూజించారు. భూమిపూజ సందర్భంగా ఆలయ నిర్మాణ శిలాన్యాస్ పూజలు చేశారు.
సుమారు అరగంటకు పైగా భూమిపూజ కార్యక్రమం కొనసాగింది. అయోధ్య రాముడి నామాలు శ్లోకాలతో కూడిన ఫలకానికి ప్రధాని పూజలు చేశారు. అంతకుముందు- లక్నో నుంచి హెలికాప్టర్లో అయోధ్యకు చేరుకున్న నరేంద్ర మోడీ తొలుత హనుమాన్ గర్హి ఆలయాన్ని సందర్శించారు. రామభక్తుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామమందిరానికి చేరుకున్నారు. రామ్లల్లాను దర్శించుకున్నారు. రాములోరి ఆలయానికి ప్రదక్షిణలు చేశారు. సాష్ఠాంగ ప్రణామం చేశారు. మూలవిరాట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. రామనామాన్ని జపించారు. అనంతరం దేవతాపుష్పంగా పరిగణించే పారిజాతం పుష్పం మొక్కను నాటారు.
Recommended Video