మోడీ మొదలెట్టేశారు! వచ్చే నెలలో విదేశీ పర్యటన!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్వరలో విదేశీ పర్యటనలు చేపట్టబోతున్నారు. రెండు దేశాల్లో ఆయన పర్యటించనున్నారు. మాల్దీవులు, శ్రీలంకల్లో మోడీ పర్యటనలు ఖాయం అయ్యాయి. జూన్ మొదటి వారంలో ఆయన ఈ రెండు దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. నరేంద్ర మోడీ వరుసగా రెండోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత.. ఆయన విదేశీ పర్యటనలకు వెళ్లబోతుండటం ఇదే తొలిసారి. దీనిపై శ్రీలంక దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఓ అధికారిక ప్రకటన చేశారు. మోడీ పర్యటన కోసం తాము ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని అన్నారు.
ప్రధానిగా నరేంద్ర మోడీ తన తొలి హయాంలో ఎన్నో దేశాల్లో పర్యటించారు. మన దేశానికి చెందిన ఏ ప్రధాని కూడా పర్యటించని దేశాల్లో తిరిగేసి వచ్చారు. మంగోలియా లాంటి దేశాల్లో అడుగు పెట్టారు. ఈ అయిదేళ్ల కాలంలో ఆయన విదేశీ పర్యటన ఖర్చు సుమారు 3000 కోట్ల రూపాయలను దాటిందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ విమర్శలను పెద్దగా పట్టించుకోలేదాయన. ఇరుగు పొరుగు దేశాలతో సఖ్యత, భారత్ పేరును ప్రపంచ దేశాల్లో వినిపించడానికి తాను విదేశీ పర్యటనలు చేస్తున్నానంటూ సమర్థించుకొచ్చారు.
రెండో విడతలో కూడా మోడీ అదే ఒరవడిని కొనసాగిస్తారా? లేదా? అనే విషయంపై పలు సందేహాలు వ్యక్తం అయ్యాయి. డిబేట్లు నడిచాయి. తొలి హయాంతో పోల్చుకుంటే ఆయన విదేశీ పర్యటనల సంఖ్య ఈ సారి తగ్గొచనే అభిప్రాయాలు కూడా వినిపించాయి. మోడీ తిరగడానికి ఏ దేశమూ మిగల్లేదని విమర్శలు కూడా ప్రతిపక్షాల నుంచి వచ్చాయి. దీనికి భిన్నంగా ఆయన వ్యవహరిస్తున్నారు.
రెండో దఫా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజుల్లోనే విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా- మాల్దీవులు, శ్రీలంకల్లో పర్యటించనున్నారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. ప్రత్యేకించి- శ్రీలంక పర్యటన సందర్భంగా ఆయన ఎలాంటి ప్రకటనలు చేస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది.
ఈ ఏడాది ఏప్రిల్లో శ్రీలంకలో ఉగ్రవాదుల ఆత్మాహూతి దళ సభ్యులు నరమేథాన్ని సృష్టించిన ప్రాంతాలను మోడీ సందర్శించనున్నారు. కొలంబోని ఆత్మాహూతి దాడుల్లో ధ్వంసమైన చర్చి సహా అన్ని ప్రాంతాలనూ సందర్శిస్తారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆత్మాహూతి దాడుల బారిన పడి ఇప్పటికీ తేరుకోలేకపోతున్న శ్రీలంక ప్రభుత్వానికి మోడీ భారత్ తరఫున మద్దతు ప్రకటిస్తారని, అవసరమైన సహాయ, సహకారాలను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
నరేంద్ర మోడీ తమ దేశంలో పర్యటించడం అత్యంత అవసరమని సిరిసేన స్పష్టం చేశారు. శ్రీలంక-భారత్ మధ్య 2600 సంవత్సరాల కిందటి నుంచే రాకపోకలు, స్నేహపూరక సంబంధాలు ఉన్నాయని అన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై పోరాడటానికి భారత్ సహకారాన్ని తాము కోరుకుంటున్నామని చెప్పారు. ఉగ్రవాదం అనేది అనేక రూపాల్లో పొంచి ఉందని, దీన్ని ఎదుర్కొనడానికి ఉమ్మడిగా పోరాటం చేయాలని తాము నిర్ణయించుకున్నట్లు సిరిసేన తెలిపారు.