చాలాకాలం తరువాత: మళ్లీ దేశ ప్రజల ముందుకు మోడీ: ఈ సాయంత్రమే: ఏం చెబుతారో?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి దేశ ప్రజల ముందుకు రాబోతున్నారు. జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతున్నారు. సాయంత్రం 6 గంటలకు ఆయన ప్రసంగం ఉండబోతోంది. ఏ అంశం మీద ఆయన ప్రసంగిస్తారనేది స్పష్టంగా తెలియరావట్లేదు. ఈ సాయంత్రం 6 గంటలకు తాను దేశ ప్రజలకు ఓ సందేశాన్ని ఇవ్వబోతున్నాను.. అంటూ ఓ సంక్షిప్త సమాచారాన్ని వెల్లడించారు. దీన్ని కొద్దిసేపటి కిందటే ఆయన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు.
Recommended Video
కరోనా వైరస్ వ్యాప్తిచెందడం ఆరంభమైన తొలి రోజుల నుంచీ దశలవారీగా ఆయన తరచూ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ వచ్చారు. వివిధ దశల్లో ఆయన కరోనా వైరస్పై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై ప్రజల్లో చైతన్యాన్ని తీసుకుని రావడానికి తరచూ దేశ ప్రజల ముందుకొచ్చేవారు. కరోనా వైరస్ సంక్షోభంలో చిక్కుకున్న వేర్వేరు రంగాలను ఆదుకోవడానికి 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన తరువాత.. ఆయన మళ్లీ దేశ ప్రజల ముందుకు రావడం తగ్గింది.
తరచూ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినప్పటికీ.. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన సందర్భాలు ఇటీవలి కాలంలో దాదాపుగా లేవు. అన్లాక్ సమయాల్లోనూ ఆయన ప్రజలకు నేరుగా ఎలాంటి సందేశాలు ఇవ్వలేదు. మన్ కీ బాత్ రికార్డింగ్ ప్రోగ్రామ్తో ఆయన తరచూ ప్రజలను పలకరిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ తీవ్రత భారీగా తగ్గుముఖం పట్టింది. ఇదివరకటి సంఖ్యతో పోల్చుకుంటే.. రోజువారీ కేసులు సగానికి తగ్గిందనే చెప్పుకోవచ్చు.
आज शाम 6 बजे राष्ट्र के नाम संदेश दूंगा। आप जरूर जुड़ें।
— Narendra Modi (@narendramodi) October 20, 2020
Will be sharing a message with my fellow citizens at 6 PM this evening.
కేంద్ర వైద్యశాఖ అధికారులు మంగళవారం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశంలో నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 46,791. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ వచ్చిన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక వంటి చోట్ల కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతోంది. ఈ పరిణామాల మధ్య ప్రధానమంత్రి.. మరోసారి దేశ ప్రజల ముందుకు రాబోతుండటం ఆసక్తి రేపుతోంది.
అదే సమయంలో- దసరా, దీపావళి పండుగ సీజన్ కూడా ఆరంభమైన నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని ప్రధాని తన ప్రసంగంలో ఓ అంశంగా ప్రస్తావిస్తారని చెబుతున్నారు. కరోనా వైరస్పై కీలక ప్రకటన ఏదైనా వెలువడే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కరోనా వైరస్ను నిర్మూలించడానికి అవసరమైన వ్యాక్సిన్ తయారీపైనా ప్రధాని కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.