ట్రిపుల్ తలాక్ బిల్లుకు పరోక్షంగా సహకరించిన తెలుగు ఎంపీలు..! పంతం నెగ్గించుకున్న ప్రధాని..
ఢిల్లీ/హైదరాబాద్ : త్రిబుల్ తలాక్ బిల్లు పాస్ అంశంలో ప్రధాని మోదీ పంతం నెగ్గించుకున్నారు. దాదాపు నాలుగేళ్లుగా చట్ట సభల్లో నలుగుతున్న బిల్లు ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. దీంతో ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ ప్రధాన ఉద్దేశంగా ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ బిల్లు విషయలో మోడీ కోరిక నెరవేరింది. రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ తక్కువగా ఉన్నా, బిల్లు 15 ఓట్ల మెజారిటీతో ఆమోదం పొందింది. ఎంఐఎం, టీఆర్ఎస్, టీడిపి పార్టీల ఎంపీలు సభనుండి వెళ్లి పోవడంతో పరోక్షంగా బిల్లు ఆమోదానికి సహకరించినట్టైంది. ఇక రాష్ట్రపతి ముద్ర వేయడమే తరువాయి. ఎలాగూ ఇది మోడీకి ఇష్టమైన బిల్లు కాబట్టి అది కూడా జరిగిపోతుంది.
సుధీర్ఘకాలం చట్ట సభల్లో నలిగిన బిల్లు..! ఎట్టకేలకు రాజ్యసభ ఆమోదం..!!
ఇక పోతే.. ముస్లిం మహిళల హక్కులను కాపాడటమే కాదు, ముస్లిం జనాభాను కంట్రోల్ చేయడంలో ఇది మొదటి అడుగుగా కూడా భావించవచ్చనే చర్చ జరుగుతోంది.ఎందుకంటే ముస్లింలకు అధిక వివాహాలు చేసుకునే అనుమతి ఉంది. వారికి పోషణ భారమైనపుడు తమకు నచ్చని భార్యలకు తలచినదే తడవుగా విడాకులు ఇచ్చేస్తున్నారు. తలాక్ విడాకుల వల్ల ముస్లిం మహిళలు రోడ్డున పడుతున్నారు. ఇక నుంచి అలాంటివి కుదరవు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజ్యసభలో ఈ సాయంత్రం ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 99, వ్యతిరేకంగా 84 ఓట్లు లభించాయి. ఇటీవలే లోక్ సభలో కూడా ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదముద్ర పడింది. కొసమెరుపు - ట్రిపుల్ తలాక్ పద్ధతిని కొన్ని ఇస్లామిక్ దేశాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి.
నెరవేరిన మోదీ చిరకాల వాంఛ..! ఇక ముస్లిం మహిళలు స్వతంత్ర్య నిర్ణయం తీసుకోవచ్చు..!!
బీజేపీ ప్రభుత్వం అనుకున్నది సాధించింది. ఏడాదిన్నర కాలంగా ఆర్డినెన్స్ తో నెట్టుకువస్తున్న ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఎట్టకేలకు ఎగువ సభలో ఆమోద ముద్ర పడింది. తలాక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదమే మిగిలి ఉంది. ఈ బిల్లును పాస్ చేయించాలని కొద్ది నెలలుగా బీజేపీ పెద్దలు పట్టుదలతో ఉన్నారు. కొద్దిరోజుల క్రితం లోక్ సభలో పాసైన ట్రిపుల్ తలాక్ బిల్లును ఈ రోజు రాజ్యసభలో ప్రవేశపెట్టింది కేంద్రం. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
పరోక్షంగా సహకరించిన తెలుగు ఎంపీలు..! బీజేపి కలిసొచ్చిన తెలుగు ఎంపీల వాకౌట్..!!
ముస్లిం మహిళల శ్రేయస్సు కోసమే ఈ బిల్లు తెచ్చామని రవిశంకర్ ప్రసాద్ వివరించారు. ప్రపంచంలో అనేక ముస్లిం దేశాలు ఈ విధానాన్ని రద్దు చేశాయని గుర్తు చేశారు. ఈ బిల్లును విపక్షాలు వ్యతిరేకించడం సబబుకాదని హితవు పలికారు. అనంతరం బిల్లుపై సభలో వివిధ పార్టీలకు చెందిన నేతలు మాట్లాడారు. బిల్లును కాంగ్రెస్, టీఎంసీ, ఆర్జేడీ, ఎస్పీ, ఆప్, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లు ఆమోదానికి ముందు బిల్లులో విపక్షాలు పలు సవరణలు ప్రతిపాదించాయి.
ఉత్కంఠ పరిణామాలు..! మూజువాణి ఓటుతో పాస్ ఐన బిల్లు..!!
అయితే అవన్నీ మూజువాణి ఓటింగ్ ద్వారా వీగిపోయాయి. చివరకు బిల్లుకు అనుకూలంగా 99 మంది ఓట్లు, వ్యతిరేకంగా 84 ఓట్లు వచ్చాయి. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు వాకౌట్ చేశాయి. ముస్లిం మహిళల శ్రేయస్సు కోసం ఈ బిల్లు రూపొందించామని, ఆమోదం లభించడం పట్ల బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. మన పక్కనున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో దీనిపై నిషేధం ఉన్నా... కేవలం రాజకీయ లబ్ధి కోసం కొన్ని పార్టీలు దీనిని వ్యతిరేకించడం గమనార్హం. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు 2017 లో చెప్పిన విషయం తెలిసిందే.