కరోనా ఎఫెక్ట్ : రిమాండ్ ఖైదీ మృతి.. ఆల్కాహాల్ అనుకుని అది తాగి..
కేరళలో దారుణం జరిగింది. పాలక్కడ్ జిల్లాలో ఓ రిమాండ్ ఖైదీ మద్యం అనుకుని శానిటైజర్ తాగి మృతి చెందాడు. ఈ విషయాన్ని జైలు అధికారులు వెల్లడించారు. మృతుడు రామన్ కుట్టి ఓ కేసులో ఫిబ్రవరి 18వ తేదీ నుంచి జైల్లో శిక్ష అనుభవిస్తున్నట్టు చెప్పారు. మంగళవారం(మార్చి 24) ఉదయం ఉన్నట్టుండి అతను కుప్పకూలిపోవడంతో ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జైల్లో ఖైదీలతో శానిటైజర్స్ తయారుచేయిస్తున్నామని... రామన్ కుట్టి పొరపాటున ఆల్కాహాల్ అనుకుని శానిటైజర్ తాగి ఉంటాడని అనుమానిస్తున్నట్టుగా జైలు అధికారులు తెలిపారు. మంగళవారం ఆసుపత్రిలో చికిత్స అనంతరం అతను కోలుకున్నట్టే కనిపించాడని.. దీంతో తిరిగి జైలుకు తరలించామని చెప్పారు. ఆ రాత్రంతా అతను బాగానే ఉన్నాడని.. కానీ బుధవారం ఉదయం 10.30గం. సమయంలో ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడని తెలిపారు. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలిపారు. పోస్టుమార్టమ్ తర్వాతే అసలు నిజాలు బయటపడుతాయని అధికారులు తెలిపారు. అయితే శానిటైజర్ తయారీలో ఉపయోగించే ఐసోప్రొపిల్ ఆల్కాహాలే రామన్ కుట్టి మృతికి కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు.
భారతదేశంలో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య శుక్రవారం(మార్చి 27) నాటికి 775కి చేరింది. వీరిలో 47 మంది విదేశీ పౌరులు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి గురువారం అత్యధికంగా 85కి పైగా కేసులు నమోదయ్యాయి. గురువారం మధ్యప్రదేశ్లో తొలి కరోనా మృతి కేసు నమోదైంది. మొత్తంగా ఇప్పటివరకు 20 మంది మృత్యువాతపడ్డారు.