షాకింగ్ : పురుషాంగం కత్తిరించి.. శివలింగం వద్ద.. జైల్లో విచిత్ర సంఘటన..
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ సెంట్రల్ జైల్లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ తన పురుషాంగాన్ని కత్తిరించి.. జైలు ప్రాంగణంలోని శివలింగానికి దాన్ని సమర్పించాడు. ఊహించని ఈ ఘటనకు జైలు అధికారులు షాక్ తిన్నారు. ఆ ఖైదీని వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంతకీ ఆ వ్యక్తి అలా ఎందుకు చేసినట్టు.. జైలు అధికారులు ఏం చెబుతున్నారు..
జైలు సూపరింటెండ్ ఏమన్నారు..
గ్వాలియర్ సెంట్రల్ జైలు సూపరింటెండ్ మనోజ్ సాహు వెల్లడించిన వివరాల ప్రకారం.. విష్ణు సింగ్ అనే వ్యక్తి 2018 నుంచి హత్య కేసులో ఇక్కడ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. అతని స్వస్థలం భిండ్ జిల్లా ఉమ్రి గ్రామం. మంగళవారం (మే 5) ఉదయం 6.30గంటలకు అతనికి రక్తస్రావం కావడాన్ని జైలు అధికారులు గమనించారు. హుటాహుటిన అతన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆ ఖైదీ ఎందుకలా చేశాడు..
తనకు కలలో శివుడు ప్రత్యక్షమయ్యాడని.. తన పురుషాంగాన్ని త్యాగం చేయాల్సిందిగా చెప్పాడని విష్ణు సింగ్ జైలు అధికారులతో చెప్పాడు. అందుకే శివుడు చెప్పినట్టు తన పురుషాంగాన్ని కత్తిరించి జైలు ప్రాంగణంలోని శివలింగం వద్ద ఉంచినట్టు తెలిపాడు. ఓ స్పూన్ను పదునుగా తయారుచేసి.. దానితోనే పురుషాంగాన్ని కత్తిరించుకున్నట్టు చెప్పాడు.
మూఢ నమ్మకాలే కారణమా.. లేక..
విష్ణు సింగ్ చెప్పిన విషయాలకు జైలు అధికారులే షాక్ తిన్నారు. ఖైదీల్లో ఉన్న మూఢనమ్మకాలే ఇలాంటి చర్యలకు కారణమని వారు భావిస్తున్నారు. అయితే విష్ణు సింగ్ చెప్పింది నిజమేనా.. లేక మరేదైనా జరిగిందా అన్న కోణంలోనూ వారు విచారణ జరుపుతున్నారు. మరోవైపు మధ్యప్రదేశ్లోని జైళ్లల్లో కరోనా వ్యాప్తి కారణంగా ఖైదీలకు విస్తృతంగా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. దీంతో కొద్దిరోజుల వరకు ఖైదీలకు బంధువులతో ములాఖత్ను రద్దు చేశారు.