మధురై సెంట్రల్ జైలులో పోలీసులకు ఖైదీల మధ్య వాగ్వాదం... రాళ్లు రువ్విన ఖైదీలు
మదురై సెంట్రల్ జైలులో ఖైదీలు పోలీసులపైకి తిరగబడ్డారు. 20 మంది రిమాండ్ ఖైదీలు జైలులో నిరసన తెలిపారు. పోలీసులు జైలులో సెర్చ్ నిర్వహించడాన్ని ఖైదీలు తప్పుబట్టారు. ఓ కేసులో నిందితుడిగా ఉన్న కుప్పై కన్నన్ అనే ఖైదీ సెల్ను సెర్చ్ చేశారు పోలీసులు. పోలీసుల తీరుపై ఆగ్రం వ్యక్తం చేసిన ఖైదీలు రిమాండ్ ఖైదీల బ్లాక్ 2 భవనం పైకి ఎక్కి న్యూజైల్ రోడ్ పైకి రాళ్లు రువ్వారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు రోడ్డుపై ట్రాఫిక్ లేకుండా చూశారు. వాహనాల దారిని మళ్లించారు.
ఇక ఘటనపై ఉన్నతాధికారులు జైలు అధికారులను ఆరా తీశారు. డీఐజీ ప్రిజన్ పళని, ఎస్పీ ఊర్మిళలు జరిగిన ఘటనపై విచారణ చేశారు. ఖైదీలతో మాట్లాడారు. ఇక వారితో చర్చిద్దామని హామీ ఇచ్చాక వారు భవంతి పై నుంచి కిందకు దిగారు. ఖైదీలతో అధికారులు చర్చలు జరిపారు. చర్చలు జరుగుతున్న సమయంలో ఖైదీలు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జైలులో నాణ్యత కలిగి ఉన్న ఆహారంను పెట్టడం లేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
ఇదిలా ఉంటే ఖైదీల సెల్ను సెర్చ్ చేసిన పోలీసులకు వారి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ కేసు నిమిత్తమై నిందితులుగా ఉన్న ఐదుగురు ఖైదీలు విచారణకు హాజరై తిరిగి వచ్చారు. వారి దగ్గర నుంచి 10 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి వారి వద్ద దొరకడంతో ఇక మొత్తం బ్యారక్లను తనిఖీలు నిర్వహించారు పోలీసులు. ఇదే సమయంలో పోలీసులకు ఖైదీలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఖైదీలు నిరసన వ్యక్తం చేశారు.