చర్లపల్లి జైల్లో టీ20 క్రికెట్ పోటీలు: సత్యం రామలింగ రాజు దూరం
హైదరాబాద్: సత్యం కుంభకోణం కేసులో జైలులో ఉన్న రామలింగ రాజు మంగళవారం నాడు.. ఇతర ఖైదీలు క్రికెట్ ఆడుతుంటే, ఆయన మాత్రం మ్యాచ్కు దూరంగా ఉన్నారట. ప్రస్తుతం దేశంలో అందరు క్రికెట్ వర్షంలో మునిగిపోతున్నారు. ఐపీఎల్ 8 అందర్నీ రంజింప చేస్తోంది.
ఈ నేపథ్యంలో చర్లపల్లి జైలులో మంగళవారం నాడు తొలిసారి ట్వంటీ20 క్రికెట్ నిర్వహించారు. ఈ మ్యాచ్కు రామలింగ రాజు సహా సత్యం కేసు దోషులు దూరంగా ఉన్నారని తెలుస్తోంది.
చర్లపల్లి జైలులో క్రికెట్ మ్యాచ్ ఏదో మొక్కుబడిగా ఆడించలేదంటున్నారు. ఆటలో కాంపిటేటివ్ స్పిరిట్ కనిపించిందంటున్నారు. తెలంగాణలోని చర్లపల్లి జైలులో క్రికెట్ ఆట ఇదే తొలిసారి. ఎవరు ఎవరికి మద్దతివ్వాలనే విషయమై ఖైదీలను అధికారులు విభజించలేదు. ఎవరికి నచ్చిన వారిని వారు చీర్ చేసుకునే అవకాశం కల్పించారు.
జైలులో మొత్తం 943 మంది ఉన్నారు. వరంగల్ సెంట్రల్ జైలు టీమ్ ట్వంటీ 20 క్రికెట్ కప్ను గెలుచుకుంది. గెలుపొందిన వారికి మంగళవారం సాయంత్రం బహుమతులు అందజేశారు. గత కొద్ది రోజులుగా తెలంగాణలోని జైలులో క్రికెట్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వరంగల్, చర్లపల్లి జైలు ఖైదీలు ఫైనల్కు చేరారు.
20వ తేదీకి వాయిదా
సత్యం కుంభకోణం కేసులో దోషులుగా నిర్ధారితమైన రామలింగ రాజు, ఆయన సోదరుడు రామరాజు, ఇతరులు నాంపల్లి కోర్టులో అప్పీల్ చేసిన విషయం తెలిసిందే. వాదనలు పూర్తయ్యాయి. దోషుల అప్పీల్ విచారణ అర్హత పైన తీర్పును 20వ తేదీకి వాయిదా వేసింది.