బస్సులో 42 మంది: బెంగళూరులో పోలీసుల గెటప్ లో సినిమా స్టైల్ ప్రైవేట్ బస్సు హైజాక్!
బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా బెంగళూరు నగరంతో పాటు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వాహనాల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఇదే మంచి సమయం అనుకున్న నిందితులు పోలీసుల గెటప్ లో బెంగళూరు నుంచి 42 మంది ప్రయాణికులతో కేరళ వెలుతున్న ప్రైవేటు బస్సును హైజాక్ చేశారు.
సినిమా స్టైల్లో హైజాక్
శుక్రవారం రాత్రి బెంగళూరు నుంచి కేరళలోని కణ్ణూరుకు లామా ట్రావెల్స్ బస్సు 42 మంది ప్రయాణికులతో బయలుదేరింది. మైసూరు రోడ్డులోని ఆర్ వీ కాలేజ్ సమీపంలో నలుగురు బైక్ లో వెళ్లి సినిమా స్టైల్ లో బస్సును అడ్డగించారు.
సోదాలు చెయ్యాలి
మేము సీసీబీ పోలీసులు, ఎన్నికలు జరుగుతున్నాయని, బస్సులో సోదాలు చెయ్యాలని ప్రయాణికులను బెదిరించారు. తరువాత నిందితులు బస్సు డ్రైవర్ మీద దాడి చేశారు. బస్సును నేరుగా రాజరాజేశ్వరి నగరలోని పట్టణగెరె ప్రాంతంలోని గోదాములోకి తీసుకెళ్లారు. ప్రయాణికులు బస్సులు ఉన్న సమయంలో ఎవ్వరూ బయటకు వెళ్లకుండా గోదాముకు లాక్ చేశారు.
పోలీసు కంట్రోల్ రూం
ప్రయాణికులకు హైజాకర్లకు అనుమానం రాకుండా పోలీసు కంట్రోల్ రూంకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న 40 మంది పోలీసులు గోదాము దగ్గరకు చేరుకుని డోర్ లాక్ పగలగొట్టి నలుగురు హైజాకర్లను అదుపులోకి తీసుకుని ప్రయాణికులను సురక్షితంగా రక్షించారు.
నాలుగు గంటలు నరకం
ప్రయాణికులు నాలుగు గంటలకు పైగా గోదాములోనే ఉండిపోయారు. పోలీసులు దాడి చేసిన సమయంలో ముగ్గురు నిందితులు తప్పించుకున్నారు. బస్సును ఎందుకు హైజాక్ చేశారు అంటూ అసలు విషయం తెలుసుకున్న పోలీసులు, ప్రయాణికులు షాక్ కు గురైనారు.
ఫైనాన్స్ కంపెనీ సమస్య
బస్సు యజమానికి పైనాన్స్ కంపెనీ రుణం ఇచ్చింది. రుణం సక్రమంగా చెల్లించనందుకు బస్సును హైజాక్ చేశారని పోలీసులు చెప్పారు. అయితే బస్సులో ప్రయాణికులు ఉన్న సమయంలో హైజాక్ చెయ్యడం, పోలీసులు అని బెదిరించడంతో రాజరాజేశ్వరి నగర పోలీసులు నిందితుల మీద ఐపీసీ 341, 342 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారని డీసీపీ రవి చెన్ననవర్ శనివారం మీడియాకు చెప్పారు.