బ్యాంక్ అకౌంట్, మొబైల్కు నో, ఐటీకి ఇవ్వాలి: ఆధార్ ఎక్కడ అవసరం, ఎక్కడ అవసరం లేదు?
Recommended Video
న్యూఢిల్లీ: ఆధార్ చట్టబద్దతపై ఐదుగురు జడ్జిలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం బుధవారం తీర్పు చెప్పింది. ఆధార్ విశిష్టమైనదిగా పేర్కొంది. అదే సమయంలో ప్రయివేటు సంస్థలకు ఆధార్ సమాచారం ఇవ్వవద్దని ప్రభుత్వానికి సూచించింది. ఆధార్ యాక్ట్లోని సెక్షన్ 57ను కొట్టివేసింది.
అందుకే ఆధార్ విశిష్టమైనది, వ్యక్తిగత స్వేచ్ఛకు అవరోధంకాదు: సుప్రీం కీలక తీర్పు
ఈ యాక్టులోని సెక్షన్ 57 ప్రకారం కేవలం రాష్ట్రాలు మాత్రమే కాదు, ఏ బాడీ కార్పోరేట్ లేదా వ్యక్తి లేదా ప్రయివేటు సంస్థ కూడా పౌరుల నుంచి ఆధార్ డిమాండ్ చేయవచ్చు. గుర్తింపు కోరుతూ ఈ ఆధార్ను కచ్చితంగా అడుగుతున్నాయి. కానీ సుప్రీం కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
బ్యాంకులకు లింక్ చేయాల్సిన అవసరం లేదు
ఆధార్ కార్డు నెంబర్ను బ్యాంకులకు లింక్ చేసిన విషయం తెలిసిందే. అయితే బ్యాంకులకు ఈ ఆధార్ నెంబర్ను లింక్ చేయాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. స్కూళ్లలో ప్రవేశాల కోసం కూడా ఆధార్ అవసరం లేదని పేర్కొంది. ఆధార్ కార్డు లేని స్కూల్ పిల్లలకు ప్రభుత్వ పథకాలను విస్మరించరాదని చెప్పింది.
టెలికాం కంపెనీలు అడగొద్దు
టెలికాం కంపెనీలు ఆధార్ కార్డును అడగవద్దని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఆధార్ను తప్పనిసరి చేస్తూ టెలికాం శాఖ ఇచ్చిన ఆదేశాలను కూడా న్యాయస్థానం కొట్టివేసింది.మొబైల్ నంబరుతో అనుసంధానానికి అవసరం లేదని పేర్కొంది. ఆధార్ యాక్టులోను సెక్షన్ 57, సెక్షన్ (2)డీలను కూడా సుప్రీం కోట్టివేసింది. లావాదేవీల డేటాను బయటపెట్టరాదని పేర్కొంది.
ప్రయివేటు కంపెనీలకు వద్దు
ప్రయివేటు కంపెనీలకు ఆధార్ డేటాను షేర్ చేయడం సరికాదని సుప్రీం కోర్టు తెలిపింది. డేటా రక్షణ కోసం పటిష్టమైన చట్టాన్ని చేయాలని సూచించింది. సీబీఎస్ఈ, నీట్, యూజీసీలకు ఆధార్ తప్పనిసరి కాదని చెప్పింది. ఆధార్ ప్రక్రియ స్వచ్చంధంగా కొనసాగాలని పేర్కొంది. ఇంటర్నెట్లో ఆధార్ సమాచారం వద్దని సూచించింది.
వీటికి ఆధార్ తప్పనిసరి
పాన్ కార్డ్ (పర్మనెంట్ అకౌంట్ నెంబర్), ఆదాయపన్ను దాఖలుకు,ప్రభుత్వ సబ్సిడీలు, సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకు ఆధార్ కార్డు తప్పనిసరి అని సుప్రీం కోర్టు పేర్కొంది. ఆదాయ పన్ను వివరాల కోసం ఆధార్ కచ్చితంగా ఉండాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, ఆధార్ మనీ బిల్లు కాదని, మనీ బిల్లులాగా దీనిని ఆమోదించి పార్లమెంటులో ఆమోదిస్తే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లేనని జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు.