దగా.. కేంద్రం చెప్తున్న దానికి విరుద్దంగా.. మోసపోయిన వందలాది రైతులు... నట్టేట ముంచారని ఆవేదన..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో దేశంలో రైతుల స్థితి గతులు మారిపోతాయని ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతలంతా బల్లగుద్ది మరీ చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ చట్టాలు అమలుకాక ముందే క్షేత్రస్థాయిలో వాటి పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయన్న ఘటనలు అక్కడక్కడ వెలుగుచూస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్లో 'కాంట్రాక్ట్ ఫార్మింగ్' పేరిట ఓ కంపెనీ 200 మంది రైతులను నట్టేట ముంచిన ఘటన వెలుగుచూసింది. కాంట్రాక్ట్ పద్దతిలో రైతుల ఆదాయం పెరుగుతుందని కేంద్రం బలంగా వాదిస్తున్న వేళ... ఇలాంటి ఘటన వెలుగులోకి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
2018లో రైతులతో ఒప్పందం...
మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాకు చెందిన వందలాది మంది రైతులతో 2018లో UWEGO అగ్రి సొల్యూషన్స్ అనే కంపెనీ కాంట్రాక్ట్ వ్యవసాయానికి ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర ఉద్యాన శాఖ అధికారులే ఈ కంపెనీతో కాంట్రాక్టును రైతులకు సిఫారసు చేశారు. ఆ ఒప్పందం ప్రకారం రైతులంతా తమ పంట చేలల్లో మునగ పంటను సాగు చేయాలి.
పంట కాపుకు వచ్చిన తర్వాత ఆ కంపెనీయే దాన్ని కొనుగోలు చేస్తుంది. అంతకుముందు, ఎకరాకు రూ.20వేలు చొప్పున చెల్లించి అదే కంపెనీ నుంచి రైతులు మునగ మొక్కలను కొనుగోలు చేయాలి. దీంతో స్థానిక రైతులంతా మొక్కల కోసం ఆ కంపెనీ ఖాతాలో డబ్బులు కూడా జమ చేశారు. కానీ తీరా డబ్బులు జమచేశాక ఆ కంపెనీ మొక్కలు ఇవ్వలేదు.
రైతులు ఏమంటున్నారు...
బేతుల్ జిల్లాకు చెందిన నదీమ్ ఖాన్(30) మాట్లాడుతూ... 'రాష్ట్ర ఉద్యాన శాఖ సిఫారసు మేరకు 2018లో UWEGO అగ్రి సొల్యూషన్స్ కంపెనీతో నేను కాంట్రాక్ట్ వ్యవసాయ ఒప్పందానికి సంతకం చేశాను. ఒప్పందంలో భాగంగా మునగ మొక్కల కోసం రూ.20వేలు చొప్పున మొత్తం రూ.40వేలు రెండు దఫాల్లో ఆ కంపెనీ ఖాతాలో జమ చేశాను.
ఒప్పందం ప్రకారం రైతులకు మొక్కలు ఇవ్వడంతో పాటు సాంకేతికపరమైన తోడ్పాటును ఆ కంపెనీ అందించాలి. కానీ అదేమీ జరగలేదు. అసలు మొక్కలే ఇవ్వలేదు. దీనిపై సెప్టెంబర్ 17,2019లో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశాను. ఆ తర్వాత కూడా ఎన్నోసార్లు అధికారులకు మొరపెట్టుకున్నాను. కానీ లాభం లేకపోయింది.' అని వాపోయాడు.
పత్తా లేకుండా పోయిన కంపెనీ...
బేతుల్ జిల్లాలో మొత్తం 200 మంది రైతులు ఆ కంపెనీతో కాంట్రాక్ట్ వ్యవసాయానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఒక అంచనా. ఎవరో కొంతమంది రైతులకు కొన్ని మొక్కలు పంపిణీ చేశారు తప్పితే... అందరూ రైతులకు మొక్కలను పంపిణీ చేయలేదని వారు ఆరోపిస్తున్నారు. ఆ పంపిణీ చేసిన మొక్కల్లోనూ చాలావరకు వాడిపోయాయని అంటున్నారు.
దాదాపు 125 ఎకరాల్లో మునగ సాగుకు ఆ కంపెనీ రైతులతో ఒప్పందం కుదుర్చుకుని ఒక్కో ఎకరాకు రూ.20వేలు చొప్పున వసూలు చేసిందని చెబుతున్నారు. ఇప్పుడు ఆ కంపెనీ ఎక్కడుందో.. ఎవరిని కలవాలో కూడా తమకు తెలియట్లేదని వాపోతున్నారు. ఒప్పందం సందర్భంగా కనిపించిన ఆ కంపెనీ ప్రతినిధులెవరూ తమ ఫోన్ కాల్స్ కూడా లిఫ్ట్ చేయడం లేదని అన్నారు.తమను నట్టేట ముంచిన ఆ కంపెనీపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కేంద్రం చెప్తున్న దానికి విరుద్దంగా...
వందలాది మంది రైతులు మోసపోయినా... వారంతా కలెక్టరేట్,అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఇంతవరకూ ఆ కంపెనీపై ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం గమనార్హం. గతేడాది కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల్లో రైతుల (సాధికారత, రక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద బిల్లు-2020లో కాంట్రాక్ట్ వ్యవసాయ విధానాన్ని పొందుపరిచిన సంగతి తెలిసిందే.
ఈ పద్దతిలో రైతుల ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ మధ్యప్రదేశ్ లాంటి ఘటనలు ఇందుకు విరుద్దంగా కనిపిస్తున్నాయి. రైతులు కూడా మొదటి నుంచి ఇదే విషయాన్ని చెబుతున్నారు. కార్పోరేట్లు తమను మోసం చేస్తే... వారితో న్యాయ పోరాటం చేసే శక్తి తమకు లేదని అంటున్నారు.