అబద్ధాలతోనే ఐదేళ్లు వెళ్లదీశారు : మోదీపై ప్రియాంక ఫైర్
లక్నో : ప్రధాని మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. బుధవారం ఫతేపూర్ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. విదేశీ పర్యటనలకు వెళ్లేందుకు సమయం ఉన్నా మోదీకి .. వారణాసి ప్రజల గోడు తెలుసుకునేందుకు మాత్రం టైం కేటాయించలేదని ఆరోపించారు. తన నియోజకవర్గ పరిధిలోని ఒక్క గ్రామాన్ని కూడా మోదీ సందర్శించలేదని పేర్కొన్నారు.
ఉద్యోగాలేవీ ?
బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల పేదలకు మేలు జరగడం లేదని తెలిపారు. కర్షక, కార్మికు, సబ్బండ వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతోందని చెప్పారు. ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ప్రతిచోట నిరుద్యోగులు కనిపిస్తున్నారని ప్రియాంక గుర్తుచేశారు. మోదీ చెప్పిన ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతు రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతుంటే సవాలక్ష ప్రశ్నలు వేస్తున్న బీజేపీ ... పెద్దల లక్షల కోట్ల రుణాలను మాఫీచేసి పేదోడి కడుపుకొట్టిందని విమర్శించారు.
చేయరు ? చేయనివ్వరా
కాంగ్రెస్ పార్టీ కనీస ఆదాయ పథకానికి నిధులేలా వస్తాయని బీజేపీ ప్రశ్నించడాన్ని ప్రియాంక తప్పుపట్టారు. పేదల సంక్షేమం కోసం న్యాయ్ పథకం అమలుచేయాలని నిర్ణయానికి వచ్చామని తెలిపారు. అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలను విస్మరించిన ఘనత బీజేపీదని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా బీజేపీ నేతలు గాంధీ-నెహ్రూ కుటుంబంపై విమర్శలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు.
టూర్లంటేనే మోజు
ప్రధాని మోదీ అబద్ధాలతోనే ఐదేళ్లు కాలం వెళ్లదీశారని ప్రియాంక ధ్వజమెత్తారు. పేదల సంక్షేమం, వారి జీవన ప్రమాణ స్థాయి మెరుగుపరిచేందుకు కృషిచేయలేదని మండిపడ్డారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు చేసేందుకు చూపిన ఇంట్రెస్ట్ .. హామీల అమలు కోసం పాటుపడలేదని ఆరోపించారు.