యుపిలో తేలని పొత్తు: ముందే డింపుల్, ప్రియాంక పోస్టర్
యుపిలో కాంగ్రెసు, ఎస్పీల మధ్య పొత్తుపై ఇంకా స్పష్టత రాలేదు. అయినప్పటికీ డింపుల్, ప్రియాంక గాంధీల పోస్టర్లు వెలుస్తున్నాయి.....
న్యూఢిల్లీ: వచ్చేనెల 11 నుంచి మొదలయ్యే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు విషయమై కాంగ్రెస్, అఖిలేశ్ యాదవ్ సారథ్యంలోని ఎస్పీ మధ్య ప్రాథమిక చర్చలే జరుగలేదు. కనీసం సోనియాగాంధీ తనయ ప్రియాంకగాంధీ, అఖిలేశ్ సతీమణి డింపుల్ యాదవ్ ఒక్కసారి కూడా కలుసుకోలేదు. కానీ వారిని కలుపుతూ పోస్టర్లు మాత్రం వచ్చేశాయి.
ఈ పనిచేసిందెవరో కాదు. కాంగ్రెస్ పార్టీ నేతలే. అలహాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి హసీబ్ అహ్మద్ ఈ పోస్టర్ రూపశిల్పి. అలహాబాద్ నగరంలో రాజకీయ పోస్టర్ల తయారీలో పేరొందిన డిజైనర్ హసీబ్ అహ్మద్. తన పార్టీకి జవసత్వాలు కలిగించేందుకు ముందుకు వస్తున్న సదవకాశాన్ని వినియోగించుకోవాలని, దాన్ని బయటకు వ్యక్తీకరించాలన్న ఆకాంక్ష మదిలో ఉన్నది కాబోలు.
కన్నౌజ్ ఎంపి, ప్రియాంకగాంధీ కలయికతో ఒక పోస్టర్ను డిజైన్ చేసి తన ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల్లో పోస్ట్ చేశాడు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పొత్తుపై ఇంకా తేల్చని రాహుల్
ఇప్పటివరకు యూపీలో అధికార సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)తో పొత్తు విషయమై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇంకా సస్పెన్షన్కు తెర తీయనేలేదు. అతి పెద్ద రాష్ట్రంగా, దేశ రాజకీయాలను శాసించే ఉత్తరప్రదేశ్లో పూర్వ వైభవం సంతరించుకోవడం సంగతి అటుంచి కనీసం తమ ఉనికిని కాపాడుకునేందుకు తహతహలాడుతున్న కాంగ్రెస్ పార్టీకి సమాజ్ వాదీ పార్టీతో ఎన్నికల పొత్తు ఆశిస్తున్న సంగతే. నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ న్యూఢిల్లీలో జరిగిన ‘జనవేదన' కార్యక్రమంలో మాట్లాడిన రాహుల్ ‘ఉత్తరప్రదేశ్ మే మజా ఆగయా (ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మంచి మజా ఎదురుగానున్నది)' అని వ్యాఖ్యానించడం గమనార్హం.
ప్రాంతీయ పార్టీలతో కలిసి..
తొలి నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పొత్తుపై రాహుల్ ఆసక్తిగానే ఉన్నారు. ప్రత్యేకించి ఎస్పీతో పొత్తుపై పార్టీలో చర్చలు జరుగుతున్నది. వాస్తవంగా ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వ్యతిరేకమైనా పార్టీ బలోపేతానికి తప్పనిసరి అని ఆయన నొక్కి వక్కాణిస్తున్నారని సమాచారం. ప్రాంతీయ పార్టీలు బలం పుంజుకున్నా కొద్దీ బీజేపీ శక్తిమంతంగా తయారవుతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశం ప్రగతి పథంలో ముందుకు సాగాలంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలని, అప్పుడే ప్రాంతీయ పార్టీలు బలహీనపడతాయని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నిర్మల్ ఖత్రి చెప్పారు.
మోడీని ఎదుర్కోవాలంటే..
గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ భరత్ సింగ్ సోలంకి సైతం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని, విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాడు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు పార్టీ శ్రేణులు కష్టపడాలని కోరారు. ‘మనం మోదీని తొలగించాలంటే ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల్లో ఆయన సారథ్యంలోని బిజెపిని ఓడించాలి. ప్రజలు మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా మన పని మనం చేయడంలో విఫలమైతే పరిస్థితులు మారిపోతాయి' అని భరత్ సింగ్ సోలంకి అన్నారు. కేరళ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పిసి విష్ణునాథ్ స్పందిస్తూ ప్రధాని మోదీ ఒక ‘నరేంద్ర దామోదర్ దాస్ తుగ్లక్' అని అభివర్ణించాడు. తాము ఆయనను భారతదేశానికి హిట్లర్ కావడానికో, ముస్సోలినీ కావడానికి అనుమతించబోమన్నారు.
ఆ పార్టీలన్నీ రెడీ...
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ, ఆర్ ఎల్డి, కాంగ్రెస్ పార్టీలతో కలిసి పోటీచేసేందుకు సిద్ధమని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) అధ్యక్షుడు శరద్ పవార్ స్పష్టమైన సంకేతాలిచ్చారు. అదే విధంగా పంజాబ్, గోవాలలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీచేసేందుకు సిద్ధమన్నారు. బుధవారం జరిగిన పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో పవార్ మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. గోవాలో కాంగ్రెస్ పార్టీతోనే పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నామని, ఒకవేళ ఏకాభిప్రాయం కుదరకపోతే ప్రాంతీయ పార్టీలతో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించామని పార్టీ ప్రధాన కార్యదర్శి తారిఖ్ అన్వర్ చెప్పారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అధికార సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న అంతర్యుద్దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీతోపాటు తామూ యూపీలో పునాది సంపాదించుకోవాలని పవార్ సారథ్యంలోని ఎన్సిపి భావిస్తున్నది.
పంజాబ్లోనూ పొత్తుకు..
పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీతోనే పొత్త పెట్టుకుంటామని ఎన్సీపి తారిఖ్ అన్వర్ చెప్పారు. ఈ సమావేశానికి పార్టీ మరో ప్రధాన కార్యదర్శి ప్రఫుల్ పటేల్ తోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ పార్టీ రాష్ట్రశాఖల అధ్యక్షులు కూడా పాల్గొన్నారు.వచ్చనెలలో మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు విషయమై రాష్ట్రస్థాయిలోనే నిర్ణయాలు ఉంటాయని తారిఖ్ అన్వర్ చెప్పారు.