కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ప్రియాంకే న్యాయం చేస్తుంది..! పంజాబ్ సీఎం సంచలన వ్యాఖ్యలు..!!
న్యూఢిల్లీ/హైదరాబాద్ : ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ బాద్యతలు తన వల్ల కాదని ప్రియాంకా గాంధీ చెప్పుకొస్తున్నప్పటికి ఆమె పేరునే ప్రతిపాదిస్తున్నారు నాయకులు. కాంగ్రెస్ పార్టీని సమర్థ వంతంగా ముందుకు తీసుకెళ్లి, జవసత్వాలు నింపే శక్తి ప్రియాంకకే ఉన్నాయనే అభిప్రాయాలు దేశ వ్యాప్తంగా వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు ప్రియాంక గాంధీనే సరైన అభ్యర్థి అని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ అన్నారు. అయితే ఎవరికి ఆ బాధ్యతలు అప్పగించాలనే దానిపై తుది నిర్ణయం మాత్రం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీదేనని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ప్రియాంక సరైన అభ్యర్థి అవుతారని అనుకుంటున్నారా అని సోమవారం నాడు మీడియా అడిగిన ప్రశ్నకు అమరీందర్ సమాధానమిస్తూ 'మా పార్టీ అధ్యక్షుడు కూడా ఆ విధంగా భావిస్తే కచ్చితంగా ప్రియాంకకు పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు వ్యక్తమవుతుంది' అని అన్నారు.
ఈనెల మొదట్లో కూడా అమరీందర్ ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ తర్వాత పార్టీ పగ్గాలను డైనమిక్ యువనేతకే అప్పగించాలని సూచించారు. రాహుల్ తీసుకున్న రాజీనామా నిర్ణయం దురదృష్టకరమని, పార్టీకి నూతన ఉత్తేజాన్ని నింపగలిగే యువనేతకే అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. యంగ్ ఇండియాను దృష్టిలో ఉంచుకుని యువనేత అవసరాన్ని సీడబ్ల్యూసీ గుర్తించాలని, అట్టడుగు స్థాయి నుంచి పార్టీని ఉత్తేజపరచాలంటే దేశంలో అత్యధిక జనాభా అయిన యువశక్తి అంచనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన సూచించారు. ప్రపంచంలోనే అత్యధిక యువజనాభా కలిగిన ఇండియాలో ప్రజలు ఆశలు, ఆకాంక్షలను గ్రహించగలగడం యువనేతలకైతేనై సాధ్యమవుతుందన్నారు. దేశంలోని 65 శాతం జనాభా 35 ఏళ్ల లోపే ఉండటాన్ని గుర్తించి, తదనుగుణంగా పార్టీలో మార్పులు చేర్పులు ఉండాలని కెప్టెన్ అమరీందర్ అన్నారు.