మోడీతో ప్రియాంక స్ట్రాంగ్ ఫైట్ .. ప్రియాంక గంగా యాత్రతో యూపీ రాజకీయవర్గాల్లో టెన్షన్
కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా యూపీలో పట్టు సాధించాలని ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ప్రియాంకా గాంధీ గంగా యాత్ర పేరుతో రంగంలోకి దింపింది. ముఖ్యంగా సామాజిక సమీకరణాలతో యూపీలో అత్యధిక స్థానాలు కొల్లగొట్టే వ్యూహంతో ముందుకు వెళ్తుంది. . దళితులు, ఓబీసీ వర్గాల ఓటు బ్యాంకు టార్గెట్ గా కృషి చేస్తుంది. . గుజరాత్లో పాటీదార్ లీడర్ హార్దిక్ పటేల్ కాంగ్రెస్లో చేరడం కూడా ఇందులో భాగమే. ఉత్తర ప్రదేశ్లో దళిత యూత్ లీడర్ చంద్రశేఖర్ ఆజాద్ని ఆహ్వానించడం కూడా వ్యూహాత్మకమే . గంగా యాత్ర చేపట్టి ముందుకు సాగుతున్న ప్రియాంక గాంధీ ఎన్నికల వ్యూహాలు ప్రత్యర్థి పార్టీలను ఆలోచనలో పడేస్తున్నాయి. గంగా నదీ సమీపాన పర్యటిస్తున్న ప్రియాంక... యాదవేతర వర్గాల్ని భారీ ఎత్తున ఆకర్షిస్తున్నారు. వాళ్లలో చాలా మంది అత్యంత వెనకబడినవారు. వారిని ఆకట్టుకునే పనిలో భాగంగా ప్రియాంక చేస్తున్న గంగా యాత్రపై యూపీ రాజకీయ వర్గాల్లో టెన్షన్ నెలకొంది.
అవును! నేనూ చౌకీదారుడినే..! పేరడీలతో ఆడుకుంటున్న నెటిజన్లు: బెడిసికొడుతున్న మోడీ ప్రచారం
ప్రియాంకా గాంధీ గంగా యాత్రతో టెన్షన్ లో బీజేపీ , బీఎస్పీ , ఎస్పీ లు
ప్రియాంక ఎత్తుగడలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ మండిపాటుకు గురవుతున్నారు . బీజేపీ కూడా అత్యంత కీలకమైన రాష్ట్రంలో ఆమె కదలికలపై దృష్టి పెట్టింది . యూపీలో కాంగ్రెస్ ప్రచారం తమను చాలా ఇబ్బంది పెట్టబోతుందా అన్న అనుమానాలు సైతం రాజకీయ వర్గాల్లో నెలకొన్నాయి. ఐతే... అసలే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్కి యూపీలో చాలా బలంగా ఉన్న బీజేపీనీ, దళిత ఓటు బ్యాంకును కొల్లగొట్టే ఎస్పీ, బీఎస్పీలను ఎదుర్కోవడం మాత్రం చాలా ప్రయాసతో కూడుకున్న పని అని తెలుస్తుంది.
యాదవేతరులే టార్గెట్ గా యాత్ర ... ప్రియాంకా పర్యటనపై ఆసక్తి
గంగా యాత్రలో భాగంగా గంగా తీర ప్రాంత గ్రామాల్లో పర్యటించనున్నారు ప్రియాంకా గాంధీ . ఈ గ్రామాల్లో యాదవేతరుల్లో ఎక్కువ మంది చేపలు పడుతూ, బోట్లు నడుపుతూ, నదీ సమీపాన వ్యవసాయం చేస్తూ బతుకుతున్నారు. కొంతమంది నదిలోని మట్టితో బొమ్మలు తయారుచేస్తూ బతుకుతున్నారు. ప్రియాంక తన ప్రచారంలో యాదవేతరుల్ని కలిసి వారి సమస్యలు తెలుసుకుంటారు. వారికి చేరువయ్యే ప్రయత్నం చెయ్యనున్నారు . అంతేకాదు... ప్రధాని చెబుతున్న స్వచ్ఛ గంగ నినాదం ఎంతవరకూ నిజమో కూడా ఆమె తెలుసుకోగలుగుతారు. ప్రధాని చెబుతున్నట్లు గంగా నది అనేది హైందవ మతానికి మాత్రమే సంబంధించినది కాదనీ... నదీ మార్గంలో హిందువులు, ముస్లింలు, ఎన్నో రకాల కులాల ప్రజలు కలిసి జీవిస్తున్నారని కాంగ్రెస్ నేతలంటున్నారు. అందుకే ఆమె గంగా యాత్ర ద్వారా అన్ని వర్గాల వారిని కలుస్తారని చెప్తున్నారు.
బీజేపీ , బీఎస్పీ , ఎస్పీలతో తలపడనున్న కాంగ్రెస్ .. ప్రియాంక సక్సెస్ అవుతారా
వీలైనంత ఎక్కువ మంది యాదవేతరులను ఆకర్షించేందుకు కాంగ్రెస్ త్వరలో హార్దిక్ పటేల్తో కూడా యూపీలో ఎన్నికల ప్రచారం చేయించబోతున్నట్లు తెలుస్తోంది. మొదట ప్రియాంక ముందున్న ప్లాన్... దళిత యూత్ నేత చంద్రశేఖర్ ఆజాద్ను మచ్చిక చేసుకోవడం. తర్వాత... పేద వర్గాలను చేరుకోవడం. కాంగ్రెస్ వేసిన ఈ ఎత్తుగడే ఎస్పీ-బీఎస్పీ, బీజేపీకి ఏమాత్రం మింగుడుపడట్లేదు.యూపీలో బీసీలు 55 శాతానికి పైగా ఉన్నారు. వీళ్లలో ఎక్కువగా యాదవులు, అహిర్లు, గ్వాలాలు కలిసి దాదాపు 20 శాతం ఉన్నారు. మండల్ కమిషన్ కాలం నుంచీ వాళ్లు సమాజ్వాదీ పార్టీతోనే ఉన్నారు. ఇక కుర్మీలు, పటేళ్లు 7.5 శాతంగా ఉన్నారు. కుర్మీలు 2014 ఎన్నికలు... 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీవైపు మొగ్గు చూపారు. యూదవులు, కుర్మీలను.... అత్యంత వెనకబడిన వర్గాలుగా చెబుతారు. వీరు నిరంతరం తమ అభిప్రాయాల్ని మార్చుకుంటూ ఉంటారు. ఓవరాల్గా యాదవేతరులు ఎవరు తమను పట్టించుకుంటే ఆ పార్టీవైపు మొగ్గు చూపుతారు .. ప్రియాంక ద్వారా వాళ్లను ఆకట్టుకోవడం ద్వారా కాంగ్రెస్ లబ్ది పొందాలనుకుంటోంది. ఇది ఎస్పీ-బీఎస్పీ, బీజేపీకి సమస్యే. సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని మరీ కాంగ్రెస్ ఈ సారి అన్ని కోణాల్లో ఓట్లు రాబట్టే వ్యూహాలతో ముందుకు పోనుంది. యూపీలో బలంగా ఉన్నా బీజేపీ తో , ఎస్పీ , బీఎస్పీ కూటమితో చాలా స్ట్రాంగ్ గా తలపడనుంది.